రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు
ABN , First Publish Date - 2022-05-28T06:31:20+05:30 IST
రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు
విజయవాడ రూరల్, మే 27 : జిల్లాలోని రైతులకు 50 శాతం రాయితీపై స్ర్పింక్లర్లు, రెయిన్గన్లను సరఫరా చేయనున్నట్లు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైర్టెర్ విజయలక్ష్మి తెలిపారు. నున్నలోని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద రైతులకు అందిస్తున్న సబ్సిడీ వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులకు వివరించారు. 50 శాతం వ్యవసాయ పరికరాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సరఫరా చేస్తుండగా, ఐదు హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్న వారికి 50 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలంలోని నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, కొత్తూరు తాడేపల్లిలోని ఉద్యాన పంటల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కంకిపాడులో..
కంకిపాడు : ఉద్వానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన డ్రిప్, స్ర్పిం కర్లు సబ్సిడీపై అందజేస్తున్నట్టు మైక్రో ఇరిగేషన్ పీడీ రవికుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యం లో రైతులకు సబ్సిడిపై అందించే పరికరాలకు సంబంధించి రైతులు రైతుభరోసా కేంద్రాల్లో తమ పేర్లను రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని సూచించారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు 90 శాతం, ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు 50 శాతం రాయితీపై అందజేయడం జరుగుతుందన్నారు. డ్రిప్ కావాల్సిన రైతులు పట్టా దారు, ఆధార్ జిరాక్స్లతో రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి జ్యోతి, జి. లక్పతి, సారిక పాల్గొన్నారు.