ఆడోళ్లతో పెట్టుకుంటే గద్దె దింపేస్తారు
ABN , First Publish Date - 2022-05-16T08:47:06+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ఆడోళ్లతో పెట్టుకుందని, ఆ ప్రభుత్వాన్ని ఆడోళ్లే గద్దె దింపుతారని మంత్రి సబితారెడ్డి హెచ్చరించారు.
బీజేపీకి మంత్రి సబిత హెచ్చరిక
సరూర్నగర్, మే 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ఆడోళ్లతో పెట్టుకుందని, ఆ ప్రభుత్వాన్ని ఆడోళ్లే గద్దె దింపుతారని మంత్రి సబితారెడ్డి హెచ్చరించారు. ఓ వైపు వంట నూనెల ధరలు, ఇంకో వైపు పెట్రో ధరలు, అవి చాలదన్నట్టు గ్యాస్ ధరలను సైతం కేంద్రం నెలకోసారి పెంచుతున్నదని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆదివారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ ర్యాలీలో సబితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రానికి కనబడడం లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని బీజేపీ నేతలు అధికారం కావాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. తుక్కుగూడ సభలో ‘ప్లీజ్.. మాకు ఒక్కసారి అవకాశమివ్వండి’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సబితారెడ్డి సెటైర్లు వేశారు. ‘ఒకాయనకు అధికారం కావాలంట.. ప్లీజ్ ప్లీజ్ అని బతిమిలాడుతున్నాడు. మేం కూడా బతిమిలాడుతున్నాం. ప్లీజ్ మోదీ గారు.. గ్యాస్ ధర తగ్గించండి’ అంటూ ఎద్దేవా చేశారు.