14 నుంచి అయ్యప్ప దర్శనం
ABN , First Publish Date - 2020-06-07T07:16:17+05:30 IST
సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. భక్తులకు ఈ నెల 14 నుంచి ఐదురోజుల పాటు అయ్యప్పస్వామి
- తెరుచుకోనున్న శబరిమల ఆలయం
తిరువనంతపురం/జమ్మూ, జూన్ 6: సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. భక్తులకు ఈ నెల 14 నుంచి ఐదురోజుల పాటు అయ్యప్పస్వామి దర్శన భాగ్యం కలుగనుంది. అయితే.. భక్తులకు మాస్కుధారణ నిబంధన తప్పనిసరి. స్వామివారి సన్నిధానం వద్దకు ఏకకాలంలో 50 మందినే అనుమతిస్తారు. వారు వెళ్లాకే, మరో బ్యాచ్ను పంపుతారు. భక్తులు ముందుగానే ‘వర్చువల్ క్యూ’ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. దర్శనానికి రెండు స్లాట్లే ఉంటాయి. ప్రసాదాల కోసం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల భక్తులు కేరళ ప్రభుత్వ ‘జాగ్రత్త’ పోర్టల్లో రిజిస్టర్ చేయించుకుని, ఈ-పాస్ తీసుకోవాలి. కొవిడ్ పరీక్ష చేయించుకుని ఉండాలి.
ఇక కేరళలోని మరో పుణ్యక్షేత్రం గురువాయూర్లో భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఆలయాన్ని తెరిచే తేదీని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. రోజుకు 60 పెళ్లిళ్లకే అనుమతి ఉండనుంది. ఇక అమర్నాథ్ యాత్ర సమయాన్ని కుదించారు. జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకే మంచు లింగ దర్శనానికి అనుమతిస్తారు. కాగా, ఈ నెల 8 నుంచి ప్రార్థనా స్థలాలు తెరిచినా తాము వెళ్లబోమని 57 శాతం మంది ప్రజలు చెప్పినట్లు లోకల్సర్కిల్స్ జరిపిన ఓ సర్వేలో తేలడం గమనార్హం.