నేడు ఒంగోలులో ట్రాక్టర్ల ర్యాలీ
ABN , First Publish Date - 2021-01-21T06:25:16+05:30 IST
ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా జిల్లాలో వివిధ రూపాల్లో నెలన్నరకుపైగా రైతు, ప్రజాసంఘాలు, వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
భారీ ఏర్పాట్లలో రైతు, ప్రజాసంఘాలు
హాజరుకానున్న జాతీయనేత విజ్జు కృష్ణ
ఒంగోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా జిల్లాలో వివిధ రూపాల్లో నెలన్నరకుపైగా రైతు, ప్రజాసంఘాలు, వామపక్షపార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఒంగోలులో భారీగా రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ, దానికి మద్దతుగా వివిధవర్గాల ప్రజలు బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు. సంఘమిత్ర జంక్షన్ నుంచి కలెక్టరేట్, మస్తాన్దర్గా, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ డిపో, మంగమూరు రోడ్డుల మీదుగా పీవీఆర్ బాలుర హైస్కూలు వరకు ఈ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ సభ నిర్వహణకు నిర్ణయించారు. రైతు ఉద్యమాలను దేశవ్యాప్తంగా సమన్వయం చేస్తూ కీలకనేతగా గుర్తింపు పొందిన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విద్యాలయం విద్యార్థి సంఘం మాజీ చైర్మన్, అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ జాతీయనేత విజ్జు కృష్ణ సభలో పాల్గొనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి రైతుసంఘాలు, వామపక్షపార్టీల నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.