ఏదీ భరోసా?

ABN , First Publish Date - 2022-05-08T06:29:54+05:30 IST

ఏదీ భరోసా?

ఏదీ భరోసా?

జిల్లాలో ఇంకా మొదలుకాని రైతు భరోసా ప్రక్రియ

ఈనెల 15 నాటికి డబ్బు జమ కావాలి

చాలా గ్రామాల్లో రప్రక్రియ ప్రారంభమే కాలేదు

జాబితాలు పంపడానికి నేడే ఆఖరు

ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు


జిల్లాలో రైతు భరోసా అమలు ప్రహసనంగా మారింది. ఈనెల 15వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కనీసం జాబితా కూడా సిద్ధం చేయని పరిస్థితి ఏర్పడింది. జాబితాలో పేర్ల వివరాలు కూడా తెలియని దుస్థితి. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే, అర్థంపర్థం లేని జవాబులతో అసలు విషయాన్ని దాట వేస్తుండగా, రైతు భరోసా నగదు ఎప్పుడు జమ అవుతుందా అని అన్నదాతలు మాత్రం ఆర్‌బీకేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్‌ పథకం పేరుతో రైతులకు వ్యవసాయ పెట్టుబడి అందిస్తున్నారు. ఒక్కో రైతుకు రూ.13,500 బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇందుకోసం రైతులకు సంబంధించిన జాబితాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, తప్పులు ఉంటే సరిదిద్ది ప్రభుత్వానికి పంపాలి. ఈ పనిని ఈ నెల 6వ తేదీన ప్రారంభించి 8న పూర్తి చేయాలి. అయితే, ఈ ప్రక్రియ రెండు జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.  

జాబితాల మాటేంటి?

లబ్ధిదారుల జాబితాలనునోటీసు బోర్డులో పెట్టాలి. శనివారం నాటికి కూడా ఈ జాబితాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో సిబ్బంది ఉన్నారు. బందరు మండలంలోని గుండుపాలెంలో రైతు భరోసా జాబితాలపై పరిశీలన ప్రక్రియ శనివారం నాటికి ప్రారంభమే కాలేదు. ఇక్కడ పనిచేసే వీఏఏ సెలవులో ఉన్నారు. జాబితాలను పరిశీలించి రైతులకు వివరాలు తెలియజేసే బాధ్యతను వేరెవరికీ అప్పగించలేదు. ఆంధ్రజ్యోతి శనివారం ఉదయం 10.30 గంటలకు ఈ కేంద్రానికి వెళ్లగా, అప్పటికీ తాళాలు తీయలేదు. పంచాయతీ కార్యదర్శికి ఫోన్‌చేసి రైతు భరోసా అంశాన్ని చెబితే, కనుక్కొని చెబుతానన్నారు. కాసేపటి తరువాత రైతు భరోసా జాబితా టెలిగ్రామ్‌లో వచ్చిందని, ఉద్యోగులు వచ్చి ఈ జాబితాలను తీస్తారని చెప్పారు. రైతు భరోసా జాబితాలను చూసుకున్నారా, లేదా అని గుండెపాలేనికి చెందిన రైతులను అడగ్గా, అలాంటిదేమీ లేదన్నారు. ఈకేవైసీకి సంబంధించి నాలుగు రోజుల క్రితం సిబ్బంది వచ్చి వేలిముద్రలు తీసుకున్నారని, జాబితాలు ఇంతవరకు చూపలేదని, నోటీసు బోర్డులో కూడా పెట్టలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రైతు భరోసా జాబితాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చారు. గుండుపాలెం సమీపంలో ఉన్న రుద్రవరం రైతు భరోసా కేంద్రంలో మార్చి నెలాఖరు నాటికి ఐదు కొత్తపేర్లు నమోదు చేయగా, ఇద్దరు రైతులు చనిపోవడంతో వారి నామినీల పేర్లతో జాబితాలను పంపారు.  

ఇంకా పరిశీలనలోనే..

ఈనెల 15వ తేదీన రైతు భరోసా నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 8వ తేదీ నాటికి జాబితాలను పరిశీలించి, మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి, ఆర్‌బీకేల ద్వారా మండల వ్యవసాయ శాఖ అధికారులకు పంపాలి. మండల వ్యవసాయ శాఖ అధికారులు వీటిని పరిశీలించి, ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపుతారు. ఆర్‌టీజీఎస్‌, సీఎఫ్‌ఎంఎస్‌ల ద్వారా ఈ జాబితాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అనంతరం రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. రైతు భరోసాకు సంబంధించి తిరస్కరణకు గురైన వారి పేర్లను, కారణాలను లాగిన్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. అర్హుల, అనర్హుల జాబితాల్లో పేరు ఉంటే రైతుల ఫోన్‌ నెంబర్లకు సమాచారం వస్తుంది. గుండుపాలేనికి చెందిన రైతులకు ఇలాంటి సమాచారమేమీ రాలేదు.

పూర్తిస్థాయిలో పరిశీలించి..

రైతు భరోసా నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. రైతుల పేర్లు, వారి భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లను సరిచూసుకుని నమోదు చేయాలి. తాజాగా ఆధార్‌ నెంబరుకు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలోనే నగదు జమ అవుతుంది. అయితే, అసలు జాబితాలను సరిచేసేందుకే ఆర్‌బీకేలలో ప్రక్రియ మొదలుకాకపోవడం గమనించదగిన అంశం.

పూర్తి సమాచారం లేదు..

రైతు భరోసాకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం ఇంకా రాలేదు. ఆర్‌బీకేలలో ఈ జాబితాలపై సోషల్‌ ఆడిట్‌ జరుగుతోంది. ఈ వివరాలన్నీ ఆయా మండల వ్యవసాయశాఖ అధికారుల ద్వారా ఆర్టీజీఎస్‌, సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్తాయి. వారు అన్నివిధాలా పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితాలను తయారు చేస్తారు. రైతు భరోసా ఇంకా మూడు, నాలుగు రోజుల్లో అందుతాయనగా, నా వద్దకు వివరాలు వస్తాయి. అప్పటివరకు జిల్లాలో ఎంతమందికి భరోసా వస్తుందనే అంశంపై స్పష్టంగా తెలియదు. - మనోహర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి



Read more