ఉక్రెయిన్‌పై యుద్ధానికి కొత్త ఆర్మీ జనరల్‌ను నియమించిన పుతిన్

ABN , First Publish Date - 2022-04-10T17:56:59+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో

ఉక్రెయిన్‌పై యుద్ధానికి కొత్త ఆర్మీ జనరల్‌ను నియమించిన పుతిన్

మాస్కో : ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ యుద్ధానికి నాయకత్వాన్ని మార్చారు. రష్యా సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను నూతన ఆర్మీ జనరల్‌గా నియమించారు. 


రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియెట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 9న విజయ దినోత్సవాలను నిర్వహిస్తారు. రష్యాలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ రోజుకు ముందే ఉక్రెయిన్‌పై యుద్ధంలో విజయాన్ని నమోదు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా మిలిటరీ కాంపెయిన్ థియేటర్ కమాండర్‌గా అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను పుతిన్ నియమించినట్లు తెలుస్తోంది. 


ఈ విధంగా గడువును పొడిగించడం వల్ల రష్యా దళాలు తప్పులు చేసే అవకాశం ఉందని, అదే సమయంలో మరిన్ని దురాగతాలకు పాల్పడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్ స్థానిక మీడియా కథనాల ప్రకారం, 13 రష్యన్ ఏరియల్ టార్గెట్స్‌ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వాయు సేన శనివారం ప్రకటించింది. ఐదు యూఏవీలు, నాలుగు క్షిపణులు, మూడు విమానాలు, ఓ హెలికాప్టర్‌ను కూల్చేసినట్లు తెలిపింది. 


Updated Date - 2022-04-10T17:56:59+05:30 IST