రంగంలోకి దిగిన మోదీ.. ఉక్రెయిన్కి కేంద్ర మంత్రులు..
ABN , First Publish Date - 2022-02-28T19:21:28+05:30 IST
స్వదేశానికి భారతీయులను రప్పించే ఏర్పాట్లపై మోదీ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: స్వదేశానికి భారతీయులను రప్పించే ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులను సరిహద్దులకు పంపాలని నిర్ణయించారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోదీ ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. విద్యార్థులను తరలిస్తున్న సరిహద్దులకు కేంద్ర మంత్రులు కూడా వెళితే బాగుంటుందని, అక్కడుండే పరిస్థితులను సమీక్షించడం మంచిదని అభిప్రాయాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఆపరేషన్ గంగా పేరుతో ఢిల్లీ, ముంబై నుంచి వెళుతున్న ప్రత్యేక విమానాల్లో కేంద్ర మంత్రులు వెళ్లాలని మోదీ ఆదేశించినట్లు సమాచారం. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదికను పీఎంవోకి అందజేయాలని ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు హర్దీప్సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్లు వెళ్లనున్నారు.