ఈ నెల 27 నుంచి భారత్, రష్యా మధ్య విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2021-01-23T23:47:42+05:30 IST

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

ఈ నెల 27 నుంచి భారత్, రష్యా మధ్య విమాన సర్వీసులు

మాస్కో: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం అదుపులోకి వస్తుండడంతో కొన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులు పున:ప్రారంభించడంపై దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా రష్యా ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత్‌కు విమాన సర్వీసులు నడిపే దిశగా చర్యలు తీసుకుంటోంది. భారత్‌తో పాటు ఫిన్లాండ్, వియత్నాం, ఖతార్‌కు కూడా రష్యా విమాన సర్వీసులు నడపనుంది. ఈ మేరకు ఉప ప్రధాని టటియానా గోలికోవా నేతృత్వం వహిస్తున్న రష్యన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 


జనవరి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రెస్పాన్స్ సెంటర్.. ఇండియాకు కూడా విమానాలు నడపనున్నట్లు పేర్కొంది. మాస్కో-ఢిల్లీ మధ్య వారానికి రెండు సర్వీసులు నడిపిస్తామని తేలియజేసింది. ఈ సందర్భంగా రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్.. విమాన సంస్థలకు మాస్కో నుంచి హనోయి, ఢిల్లీ, హెల్సింకీ నగరాలకు వీక్లీ రెండు సర్వీసులు.. రష్యా నుంచి దోహాకు వారానికి మూడు సర్వీసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే సెయింట్ పీటర్స్‌బర్గ్ నుండి హెల్సింకీకి వారానికి రెండు సర్వీసులు నడిపేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అయితే, యూకేకు మాత్రం 2021 ఫిబ్రవరి 1 వరకు విమాన సర్వీసులు నడపబోమని స్పష్టం చేసింది. బ్రిటన్‌లో బయటపడ్డ కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 22 నుంచి ఆ దేశానికి రష్యా విమాన సర్వీసులు నిలిపివేసింది.   

Updated Date - 2021-01-23T23:47:42+05:30 IST