పీహెచ్సీల్లో హడావిడి
ABN , First Publish Date - 2022-08-08T05:37:53+05:30 IST
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొద్దిరోజులుగా టెన్షన్ వాతావరణం నెలకుంటోంది. తనిఖీలు, పరిశీలనలు చురుగ్గా జరుగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది పనితీరుపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తహసీల్దార్లు.. ఎంపీడీవోల ఆకస్మిక తనిఖీలు
టెన్షన్ పడుతున్న వైద్యులు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొద్దిరోజులుగా టెన్షన్ వాతావరణం నెలకుంటోంది. తనిఖీలు, పరిశీలనలు చురుగ్గా జరుగుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది పనితీరుపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఎంపీడీవోలు మరింత ముందుంటున్నారు. తనిఖీల కారణంగా డాక్టర్లలో ఆందోళన మొదలైంది. పీహెచ్సీలను సమగ్రంగా పరిశీలించాలని జిల్లా పరిషత్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే వైద్యాలయాల్లో ఈ హడావిడి ఉంటోంది. డాక్టర్లు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడం.. బయోమెట్రిక్ విధానం ఉన్నా కొంత మంది వచ్చి వెళ్లిపోతున్నారంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. పీహెచ్సీలపై దృష్టి పెట్టాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లకు మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో ఎప్పటి కప్పుడు వారు ఆస్పత్రులను సందర్శిస్తున్నారు. అయితే దీనిపై కొన్నిచోట్ల డాక్టర్లలో వ్యతిరేకత మొదలైంది. తమపై పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లో అధికారులున్నారని, అయినప్పటికీ వీరి హడావిడీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయం నుంచే పీహెచ్సీల పనితీరుపై ఎంపీడీవోలకు, తహసీల్దార్లకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా పీహెచ్సీల పనితీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వీరి పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ కూడా మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో మండల అధికారుల హడావిడి ఎక్కువైంది. కొన్నిచోట్ల వారి సొంత విధులు పక్కన పెట్టేసి ఆకస్మిక తనిఖీలకు వెళ్తున్నారు. దీనివల్ల మండల కార్యాలయాలకు వివిధ పనులకు వెళ్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
స్పందనలో వస్తున్న అర్జీల్లో సగానికి పైగా రెవెన్యూ శాఖవే. ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చే వారికి వారూ అందుబాటులో ఉండటం లేదు. ఇతర శాఖల తనిఖీల బాధ్యతలు మీద పడటంతో సొంత శాఖల పనులు మందగిస్తున్నాయి. ఇదే విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్వీ రమణకుమారి వద్ద ప్రస్తావించగా తాము ఎప్పటికపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరుపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. డిప్యూటీ డీఎంఅండ్హెచ్వోలు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, అయినప్పటికీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు వెళ్తున్నారని అన్నారు.
=