అటవీ భూముల్లో పల్లె ప్రకృతి వనాలు
ABN , First Publish Date - 2022-05-18T03:49:21+05:30 IST
అటవీ భూముల్లో పల్లె ప్రకృతి వనాలు
- భూములిచ్చేందుకు ముందుకొచ్చిన అటవీ శాఖ
- ప్లాంటేషన్ గుర్తింపు ప్రక్రియ షురూ!
మేడ్చల్, మే 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హరితహారం లక్ష్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం అటవీ భూముల్లోని ఖాళీ స్థలాల్లో ప్రకృతి వనాలను పెంచాలని నిర్ణయించింది. గ్రామాలకు, మున్సిపాలిటీలకు, కార్పొనరేషన్లకు చేరువుగా ఉన్న అటవీ ప్రాంత ఖాళీ భూములను తీసుకొని వాటిల్లో ప్రకృతి వనాలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు అటవీశాఖ అడవుల్లో చెట్లు, మొక్కలు లేని ఖాళీ ప్రాంతాలను ప్రకృతి వనాలకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రకృతి వనాల గుర్తింపు, మొక్కల పెంపకం చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లాలో ఈ సంవత్సరం హరితహారంలో 60లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖాళీ స్థలాల గుర్తింపు చేపట్టారు. అయినా 60లక్షల మొక్క లు నాటేందుకు స్థలం కొరత ఏర్పడింది. దీంతో మేడ్చల్, కీసర, ఘట్కేసర్, మూడు చింతలపల్లి, శామీర్పేట మండలాలకు ఆనుకొ ని ఉన్న అటవీ భూముల్లో భారీగా మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విరివిగా మొక్కల పెంపకంతో అటవీ భూములను సైతం ఆక్రమణల బారినుంచి కాపాడే ఆస్కారం ఉండడంతో ఈ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు జిల్లాలో అటవీ భూములు ఎక్కడెక్కడున్నాయి.. ఎక్కడ భారీగా ఖాళీలు ఉన్నాయి.. భారీగా మొక్కల పెంపకం చేపట్టాల్సిన ప్రాంతాలేవి? అనే అంశాలపై పంచాయతీ రాజ్, అటవీ శాఖల అధికారుల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.