పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధి: ఎంపీపీ శ్రీదేవి
ABN , First Publish Date - 2022-06-28T04:56:37+05:30 IST
పట్టణాలకు దీటుగా సిద్దిపేట పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ గన్నమనేని శ్రీదేవిచందర్రావు అన్నారు.
మండల సర్వసభ్య సమావేశం
సిద్దిపేట రూరల్, జూన్ 27: పట్టణాలకు దీటుగా సిద్దిపేట పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ గన్నమనేని శ్రీదేవిచందర్రావు అన్నారు. సోమవారం రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరణ ఇవ్వగా, పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంకటాపూర్లో కరెంటు సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ గోపని లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్రావు సహకారంతో రూరల్ మండలంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం కూడా తోడైందన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్పామ్, పట్టుపురుగులు, పండ్ల తోటలపై దృష్టి పెట్టాలని కోరారు. మన ఊరు-బడి మన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 12 సంవత్సరాలు నిండిన వారు టీకాలు వేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో సమ్మిరెడ్డి మాట్లాడుతూ.. మండలంలో పల్లె ప్రగతి విజయవంతం అయిందని, మిగిలిన పనులను పది రోజుల్లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో వాడకుండా చర్యలీ తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నికైన మచ్చ విజితను సన్మానించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ యాదగిరి, సర్పంచ్లు పల్లె నరేశ్, ఏర్వ రమేశ్, నీరటి కవిత, ఏల దేవయ్య, ఎంపీటీసీ రాజాబాబు పాల్గొన్నారు.