రూపాయి మళ్లీ ‘బేర్’
ABN , First Publish Date - 2022-05-19T06:37:52+05:30 IST
దేశీయ కరెన్సీ బుధవారం మరింత క్షీణించింది. అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 16 పైసలు నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.77.60 వద్ద ముగిసింది.
ముంబై : దేశీయ కరెన్సీ బుధవారం మరింత క్షీణించింది. అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 16 పైసలు నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి రూ.77.60 వద్ద ముగిసింది. ప్రధాన కరెన్సీలతో డాలర్ మారకం రేటు పుంజుకోవడం, భారత మార్కెట్ నుంచి ఎఫ్పీఐల పెట్టుబడుల ఉపసంహరణ ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలంటున్నాయి. చమురు ధర బ్యారెల్ 113 డాలర్లకు చేరడం కూడా రూపాయి మారకం రేటును దెబ్బతీస్తోంది. బుధవారం ఉదయం రూ.77.57 వద్ద ప్రారంభమైన రూపాయి ఒక దశలో రూ.77.61 స్థాయిని తాకింది. ఆర్బీఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఆదుకోకపోతే, త్వరలోనే డాలర్తో రూపాయి మారకం రేటు రూ.80ని తాకే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
సెన్సెక్స్ రిలీఫ్ ర్యాలీకి బ్రేక్
రెండు రోజుల సెన్సెక్స్ రిలీఫ్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. మధ్యాహ్నం వరకు లాభాలతో ట్రేడైన సూచీలు, అక్కడి నుంచి అమ్మకాల ఒత్తిడితో నీరసించాయి. చివరికి 109.94 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 54,208.53 వద్ద, 19 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 16,240.30 వద్ద ముగిశాయి.
‘సిప్’లలోకి రూ.1.24 లక్షల కోట్లు
మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో ఎంఎఫ్ సంస్థలు సిప్లకు ఆదరణ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో సిప్ల ద్వారా సమీకరించిన నిధులు రూ.1.24 లక్షల కోట్లకు చేరాయి.