రాష్ట్రంలో తిరోగమనంలో పాలన
ABN , First Publish Date - 2021-07-24T05:32:27+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన తిరోగమనంలో ఉందని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి
విజయనగరం రూరల్, జూలై 23 : రాష్ట్రంలో ప్రభుత్వ పాలన తిరోగమనంలో ఉందని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా అశోక్ బంగ్లా నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖాళీ గ్యాస్ బండలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు వనజాక్షి మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేద సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహన చోదకులపై భారం పడిందన్నారు. గతంతో పోలిస్తే ప్రతి వస్తువుపై 300 శాతం ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విపత్తు కాలంలో ప్రజలు అవస్థలు పడుతుంటే ధరలు నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను వంచించారని, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పట్టకుండా వ్యవహరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి అనూరాధ బేగం, కార్యదర్శులు లెంక హైమావతి, కింతాడ కళావతి, కార్పొరేటర్ కర్రోతు రాధామణి, కింతాడ కళావతి, మహిళా నాయకులు చిల్ల పద్మ, బొంతు ఉమ, పార్వతి, సత్య తదితరులు పాల్గొన్నారు.