పోలీసు జాగిలం రూబి మృతి
ABN , First Publish Date - 2022-05-19T07:14:06+05:30 IST
పోలీసు శాఖలో తొమ్మిదేళ్లపాటు విశేషంగా సేవలందించిన జాగిలం రూబి వయోభారంతో మంగళవారం మృతిచెందింది.
లాంఛనాలతో అంత్యక్రియలు
ఒంగోలు (క్రైం), మే 18: పోలీసు శాఖలో తొమ్మిదేళ్లపాటు విశేషంగా సేవలందించిన జాగిలం రూబి వయోభారంతో మంగళవారం మృతిచెందింది. పోలీసు భద్రతా విభాగంలో ట్రాకర్గా సేవలందించిన రూబి వయస్సు 13 ఏళ్లు. దొంగతనం కేసులను ఛేదించడంలో దిట్ట. లాబ్రడార్ జాతికి చెందిన జాగిలం 2011 ఏప్రిల్ 1న పోలీసు శాఖలో అడుగుపెట్టింది. ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఎస్ ప్రసాద్ హ్యాండ్లర్గా పనిచేశారు. జాగిలం 32 కేసుల్లో కీలకమైన ఆధారాలను పట్టింది. రూబి అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో బుధవారం జరిగాయి. తొలుత రూబి కళేబరాన్ని అమరవీరుల స్థూపం వద్ద ఉంచారు. ఎస్పీ మలికగర్గ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు శిక్షణ కేంద్రం వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియల్లో ఏఎస్పీ కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ ఆశోక్బాబు, ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఏఆర్ డీఎస్పీ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.