ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఇది: ఆర్టీసీ ఎండీ
ABN , First Publish Date - 2022-02-23T01:31:42+05:30 IST
ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఇది: ఆర్టీసీ ఎండీ
అమరావతి: కేంద్రం ఆదేశాల మేరకు నవంబర్ నుంచి డీజిల్ బల్క్ రేట్లు పెరిగాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు అన్నారు. ఫిబ్రవరి 15 నాటికి రిటైల్గా రూ.96.02 ఉంటే బల్క్ ఇంధనం రూ.100.41 ఉందన్నారు. అలాగే రిటైల్ కంటే రూ.4.39 లీటర్కు మాకు డీజిల్ ధర పెరిగిందని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు రూ.32 లక్షలు అదనంగా ఖర్చవుతోందని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఏడాదికి 30 కోట్ల లీటర్ల డీజిల్ కొంటోందని పేర్కొన్నారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రాబోతున్నాయని వెల్లడించారు. డీజిల్ ధరలు పెరిగినా టికెట్ ధరలు పెంచలేదన్నారు. ఏలూరు, రాజోలు, రంగంపేట, ఉరవకొండలో ఏపీఎస్ఆర్టీసీకి రిటైల్ పెట్రోల్ బంకులున్నాయని తెలిపారు. రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. బల్క్ రేట్లు తగ్గితే ఆయిల్ తయారీ సంస్థల నుంచి తిరిగి కొంటామన్నారు. అలాగే త్వరలో 100 ఎలక్ట్రిటిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రయోగాత్మకంగా 100 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.