తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల బాదుడు

ABN , First Publish Date - 2022-04-09T01:17:41+05:30 IST

ప్రయాణికులపై టీఎస్‌ఆర్టీసీ మరోసారి భారం మోపింది. డీజిల్‌ సెస్ పేరుతో టీఎస్‌ఆర్టీసీ చార్జీలను పెంచింది.

తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల బాదుడు

హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్‌ఆర్టీసీ మరోసారి భారం మోపింది. డీజిల్‌ సెస్ పేరుతో టీఎస్‌ఆర్టీసీ చార్జీలను పెంచింది. 25 రోజుల్లో మూడుసార్లు ఛార్జీలు పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో 2 రూపాయలు.. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.5 పెంచారు. పెరిగిన బస్సు చార్జీల ధరలు శనివారం నుంచి అమలులోకి వస్తాయి. డీజిల్ రేట్లు పెరగడంతోనే చార్జీలు పెంచామని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి తెలిపారు. 


నష్టాల ఊబి నుంచి కొంతైనా బయటపడేందుకుగాను ‘డీజిల్‌ సెస్‌‘ విధించాలని టీఆఎస్‌ఆర్టీసీ భావించింది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దీనికితోడు కరోనా కల్లోలం సృష్టించడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనినుంచి బయటపడేందుకుగాను మార్చిలో రౌండప్‌ చార్జీలు, టోల్‌ సెస్‌, ప్యాసింజర్‌ సెస్‌ పేరిట 10 శాతానికిపైగా చార్జీలను పెంచింది.


ఆర్టీసీకి చమురు సంస్థలు బల్క్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రైవేట్‌ బంక్‌ల నుంచి ఎక్కువ ధర చెల్లించి డీజిల్‌ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకు రోజుకు సుమారు రూ.35-40 లక్షల వరకు సంస్థపై అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. గడిచిన వారం పది రోజులుగా ప్రయాణికుల ఆక్యుపెన్సీ 65 నుంచి 73 శాతానికి పెరిగినప్పటికీ ఆదాయం మాత్రం పెరగడంలేదు. సెస్‌ పేరుతోనైనా కొంత ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.  

Updated Date - 2022-04-09T01:17:41+05:30 IST