అక్రమ రవాణాకు మార్గం ఆర్టీసీ కార్గో
ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST
ఆర్టీసీ అంటే ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ, ప్రత్యేక గుర్తింపు, మర్యాద ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆ సంస్థ అంటేనే చిన్నచూపు చూసే పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారులు, డ్రైవర్ల సంయుక్త సహకారం
అక్రమంగా మద్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ...
పోలీసుల అదుపులో డ్రైవర్లు
ఆదాయ వనరుగా మద్యం అక్రమ రవాణా
బుక్చేసిన వారి వివరాలు తీసుకోవడంలో విఫలం
నెల్లూరు(స్టోన్హౌస్పేట), మార్చి 7 : ఆర్టీసీ అంటే ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ, ప్రత్యేక గుర్తింపు, మర్యాద ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆ సంస్థ అంటేనే చిన్నచూపు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను సురక్షితంగా గమ్యసా ్థనాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లు ప్రస్తుతం అధిక ఆదాయం కోసం, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇతర ప్రాంతాల నుంచి ప్రభుత్వం నిషేధించిన వస్తువులు, మండే వస్తువులను ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలువురు ఆర్టీసీ డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.
నిషేధిత వస్తువుల రవాణా
ఆరీసీ కొన్నేళ్ల నుంచి కార్గో సేవలను ప్రజలకు అందిస్తున్నది. ప్రజలు ఆ కార్గో సెంటర్కు వచ్చిన తర్వాత సిబ్బందితో తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తున్నది. జిల్లాలోని పది ఆర్టీసీ డిపోల పరిధిలో కార్గో సర్వీసులు ఉన్నాయి ఈ కార్గో సర్వీసుల్లో వస్తువులు, కాగితాలు, పుస్తకాలు, ట్యాబ్లెట్లు.. ఇలా పలు రకాల వస్తువులను ఇతర ప్రాంతాలకు డెలివరీ చేస్తుంటారు. అయితే కొందరు ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బంది సహకారంతో కార్గోలో నిషేధిత వస్తువులను తరలిస్తూ అధిక లాభాలు అర్జిస్తున్నారు. ఇక కార్గోతో సంబంధం లేకుండా ఆర్టీసీ డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తూ కేసులకు కేసులు మద్యం తమ వెంట ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి జిల్లాలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆర్టీసీ బస్సుల్లో అక్రమ మద్యం తరలిస్తున్న పలువురు డ్రైవర్లను సెబ్ అధికారులు అరెస్టు చేశారు. గత శుక్రవారం ఆర్టీసీ కార్గోలో బుక్ చేసిన బాక్సులో వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల మద్యం పట్టుబడ టం సంచలనంగా మారింది. దొరికిన వారే దొంగ.. దొరకని వారు దొర.. అన్నట్లుగా కార్గోలో పార్సిల్ల పేరుతో నిషేధిత వస్తువుల రవాణాలో పోలీసులు గుర్తించి పట్టుకున్న వారు మాత్రమే దోషులుగా మిగులుతుంటే మిగిలిన వారు మాత్రం కార్గోను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు.
మద్యం, గుట్కాల రవాణా
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీతో ఇతర రాష్ట్రాల మద్యానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. మన రాష్ట్రంలో మద్యం ధరలు ఆకాశాన్ని అంటు తుండటం, గతంలో దొరికే బ్రాండ్లు ప్రస్తుతం దొరకక పోతుండటంతో మందుబాబులు వారు ఎప్పటి నుంచే తాగుతున్న బ్రాండ్ల కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకునేం దుకు లారీ డ్రైవర్లు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లను సంప్రదిస్తున్నారు. అయితే లారీల్లో మద్యం దిగుమతి చేసుకోవడం కష్టంగా భావిస్తున్న కొందరు ఆర్టీసీ బస్సుల్లో మద్యాన్ని జిల్లాకు రప్పించేలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్గో సేవలను నిషేఽధిత వస్తువుల రవాణా కు ఉపయోగించడం ప్రారంభించారు. డెకరేషన్ సామాన్లు, దుస్తులు, ఎలక్ర్టానిక్, ఎలక్ర్టికల్ వస్తువులు, స్టీలు సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, పూలు, ఇలా అనేక పార్శిల్ల పేరుతో నిషేధిత వస్తువులైన గుట్కా, ఇతర రాష్ట్రాల మద్యం, బంగా రు ఇలా అనేక వస్తువులను జిల్లాకు దిగుమతి చేసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
వరుసగా దొరికిపోతూ..
ఆర్టీసీ బస్సుల్లో మద్యాన్ని తరలిస్తున్న ఎంతో మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి మద్యాన్ని పోలీసులు స్వాదీనం చేసుకుంటూనే ఉన్నారు. ఉన్నతాధికా రుల ఒత్తిడి, యూనియన్ నాయకుల మొహమాటం, బంధువులు, స్నేహితుల ఒత్తిడితో మద్యం రవాణా చేస్తున్నారు.ఈ క్రమంలో ఫుల్బాటిల్పై రూ.500 అధిక ఆదాయం వస్తున్నది. ఎక్కువుగా సింగల్ డ్రైవర్లు ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
తనిఖీలు నామమాత్రమే...
ఆర్టీసీ కార్గో సర్వీసును ప్రవేశపెట్టిన తర్వాత సంస్థకు ఆదాయం పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో అసలు ఎవరు ఏ వస్తువులను డెలివరీ చేస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఏ వస్తువులు జిల్లాకు వస్తున్నాయి, వస్తువును బుక్ చేసే వారి ఆధార్, ఇతర వివరాలు తీసుకోవడం,,, ఇలా ఏ విషయంలోనూ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించడం లేదు. ఏ వస్తువులను పార్శిల్ ఇచ్చినా నేరుగా బరువు వేసి బుక్ చేసేస్తున్నారు. నిషేధిత వస్తువులు అయిన మండేటివి, పేలేటివి, గుట్కాలు, ఇతర రాష్ట్రాల మద్యం, గంజాయి, మత్తు పదార్ధాలు ఇలా ఏవి పార్శిల్లో వస్తున్నాయో ఎవరూ తనిఖీ చేయడం లేదు. ఈ క్రమంలో నిషేధిత వస్తువుల రవాణాకు ఆర్టీసీ కార్గో అడ్డాగా మారుతోంది.