ఆర్టీసీ బస్లో గంజాయి, సారా స్వాధీనం
ABN , First Publish Date - 2021-12-09T03:42:44+05:30 IST
ఆర్టీసీ బస్లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయి, 7 లీటర్ల విప్పసారాను కావలి ఎస్ఈబీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు.
ముగ్గురి అరెస్ట్
కావలి రూరల్, డిసెంబరు 8: ఆర్టీసీ బస్లో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయి, 7 లీటర్ల విప్పసారాను కావలి ఎస్ఈబీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాల మేరకు.. ఎస్ఈబీ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముసునూరు టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్లో తనిఖీలు చేపట్టి తమిళనాడు రాష్ట్రం అరక్కోణంకు చెందిన రాజకుమార్, జీవరత్నం లగేజీలు పరిశీలించగా 4 కిలోల గంజాయి ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే బస్లో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం నుంచి 7 లీటర్ల విప్పసారా తెచ్చుకుంటున్న జిల్లాలోని దగదర్తి మండలం చౌటపుత్తేడుకు చెందిన కాకులోరి వీరబ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని సారా స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు పంపినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.