బస్సుపై పడిన ఇనుపకమ్మీలు..
ABN , First Publish Date - 2022-09-28T14:29:25+05:30 IST
స్థానిక రామాపురంలో మంగళవారం వేకువజాము మెట్రోరైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇనుప కమ్మీలు క్రేన్ నుంచి జారి
- ఇద్దరు డ్రైవర్లు సహా ముగ్గురికి గాయాలు
చెన్నై, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక రామాపురంలో మంగళవారం వేకువజాము మెట్రోరైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇనుప కమ్మీలు క్రేన్ నుంచి జారి సిటీ బస్సు పై పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీని కార ణంగా గంటకు పైగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామాపురం పూందమల్లి హైవే మధ్య మెట్రోరైలు మార్గం కోసం ఫ్లైఓవర్ స్తంభాల కాంక్రీటు పనులు జరుగుతున్నాయి.ఆ మేరకు ఆ ప్రాంతంలో మంగళవారం వేకువజామున ఇనుపకమ్మీలను భారీ క్రేన్ ద్వారా నిలబెడుతున్న సమయంలో ఊహించని విధంగా ఆ కమ్మీలు జారి, కుండ్రత్తూరు నుంచి ఆలందూరు డిపోకు రవాణా సిబ్బందిని తీసుకెళుతున్న సిటీ బస్సుపై పడింది. ఆ కమ్మీల బరువుకు బస్సు పైకప్పు నుజ్జు నుజ్జయింది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్ అయ్యాదురై (52), మరో డ్రైవర్ భూపాలన్ (45), కంటైనర్ లారీ డ్రైవర్ రంజిత్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే పాండీబజార్ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరించారు. ఆ తరావ్త బస్సుపై పడిన ఇనుపకమ్మీలను తొలగించే పనులు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రహదారిలో గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.