రెయిలింగ్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-05-22T06:03:37+05:30 IST
నల్లగొండ జిల్లా నకిరేకల్లోని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 4.30కు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఎనిమిది మందికి స్వల్పగాయాలు
నకిరేకల్, మే 21: నల్లగొండ జిల్లా నకిరేకల్లోని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 4.30కు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ బర్కత్పుర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 42 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళుతుండగా నకిరేకల్ మండలం చీమలగడ్డ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఖమ్మం, సూర్యాపేటకు చెందిన ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులను అటుగా వెళ్లే బస్సుల్లో పంపించారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. రోడ్డు ప్రమాద ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని నకిరేకల్ పోలీ్సస్టేషన్ రైటర్ శ్రీనివాసాచారి తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తమ బస్సును అతి వేగంగా ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో రెయిలింగ్ను ఢీకొట్టినట్లు డ్రైవర్ నర్సింహ తెలిపారు.