ఆర్టీసీలో సరుకు రావాణా సేవలు విస్తృతం
ABN , First Publish Date - 2021-12-03T03:47:21+05:30 IST
ఆర్టీసీలో సరుకు రావాణా సేవలను విస్తృత పరుస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు (కమర్షియల్) దివ్యకామాక్షి పేర్కొన్నారు.
అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు దివ్యకామాక్షి
కావలి, డిసెంబరు 2: ఆర్టీసీలో సరుకు రావాణా సేవలను విస్తృత పరుస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు (కమర్షియల్) దివ్యకామాక్షి పేర్కొన్నారు. కావలి కార్గో కేంద్రంలో గురువారం ఆమె తనిఖీలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో పలు వ్యాపారులను కలిసి కార్గో అందిస్తున్న సేవలలో వారి సమస్యలను సలహాలను స్వీకరించారు. సిబ్బందికి నూతన సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ నుంచి కావలిలో కార్గో డోర్డెలివరీ సేవలను ప్రారంభించామని, అతి తక్కువ సమయంలో డెలివరీ చేస్తామన్నారు. వస్త్రవ్యాపారుల కోరిక మేరకు సంక్రాంతి సందర్భంగా అదనపు సిబ్బందితో కావలిలో మరో కౌంటర్ ఏర్పాటు చేసి బుకింగ్ చేసిన తర్వాత 4 గంటలకు నెల్లూరు నగరంలో షాపుల వద్దకు సరుకులు చేర్చుతామన్నారు. కావలి డిపో మేనేజరు కే హరి మాట్లాడుతూ పట్టణ, పరిసర మండలాల్లో కార్గో ఏజంట్లుగా స్వయం ఉపాధి పొందదలచిన వారు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.