రిజర్వేషన్లకు గట్టి మద్దతు : ఆరెస్సెస్
ABN , First Publish Date - 2021-08-11T00:58:44+05:30 IST
సమాజంలోని ఓ వర్గం అసమానతలను అనుభవిస్తున్నంత వరకు
న్యూఢిల్లీ : సమాజంలోని ఓ వర్గం అసమానతలను అనుభవిస్తున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే అన్నారు. అటువంటివారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలను పెంచేందుకు దోహదపడే రిజర్వేషన్లకు ఆరెస్సెస్ గట్టి మద్దతుదారు అని స్పష్టం చేశారు. ‘‘మేకర్స్ ఆఫ్ మోడర్న్ దళిత్ హిస్టరీ’’ పుస్తకావిష్కరణ సభలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇండియా ఫౌండేషన్ నిర్వహించింది.
దళితుల చరిత్ర లేకపోతే భారత దేశ చరిత్ర అసంపూర్ణమవుతుందని దత్తాత్రేయ చెప్పారు. సామాజిక మార్పులో దళితులు ముందు వరుసలో ఉన్నారన్నారు. భారత దేశ చరిత్ర, దళితుల చరిత్ర వేర్వేరు కాదన్నారు. తాను, ఆరెస్సెస్ రిజర్వేషన్లకు గట్టి మద్దతుదారులమని స్పష్టం చేశారు. సాంఘిక సామరస్యం, సాంఘిక న్యాయం అనేవి తమకు రాజకీయ వ్యూహాలు కాదన్నారు. ఇవి తమకు దృఢ విశ్వాసాలని తెలిపారు. రిజర్వేషన్లు భారత దేశానికి చారిత్రక అవసరమని చెప్పారు. సమాజంలోని ఓ వర్గం అసమానతను అనుభవిస్తున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య సయోధ్య, రిజర్వేషన్లు చెట్టపట్టాలు వేసుకుని కదలాలన్నారు.