ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రత్యక్ష చర్చలు జరపాలి : భారత్
ABN , First Publish Date - 2020-07-03T05:15:18+05:30 IST
శాంతియుత సహజీవనం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి
న్యూఢిల్లీ : శాంతియుత సహజీవనం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రత్యక్ష చర్చలు జరపాలని భారత దేశం పేర్కొంది.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని కొన్ని భూభాగాలను కలుపుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్న సమయంలో భారత దేశం తన వైఖరిని పునరుద్ఘాటించింది.
ఇజ్రాయెల్ అనెక్సేషన్ ప్లాన్ గురించి స్పందించాలని కోరినపుడు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, తమ వైఖరి సుస్పష్టంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి చెప్తున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా శాంతియుత సహజీవనం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రత్యక్ష చర్చలు జరపాలని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ అనెక్సేషన్ ప్లాన్ ప్రకారం, వివాదంలోని భూమిలో సుమారు 30 శాతం పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. మిగిలిన భూభాగంపై పాలస్తీనాకు పరిమిత స్వయంప్రతిపత్తిని ఇవ్వాలనుకుంటోంది. ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ జనవరిలో ప్రకటించింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.