గురుకులాలకు 50 శాతమైనా నిధులివ్వలేదు
ABN , First Publish Date - 2021-07-26T08:17:53+05:30 IST
గురుకులాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే తప్ప, కనీసం 50ు నిధులు కూడా విడుదల చేయలేదని తెలంగాణ గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోంది: ప్రవీణ్కుమార్
ఘట్కేసర్ రూరల్, జూలై 25: గురుకులాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే తప్ప, కనీసం 50 శాతం నిధులు కూడా విడుదల చేయలేదని తెలంగాణ గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం అంతటి అసమర్థ పాలనను కొనసాగిస్తోందన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని ఏస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం బహుజన పొలిటికల్ స్కూల్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ గురుకులాల్లో నాలుగు లక్షల మంది, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 30 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఆరున్నరేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, డీజీపీగా పదోన్నతి అవకాశం ఉన్నా.. ఉద్యోగాన్ని తృణపాయంగా వదులుకున్నానని చెప్పారు. అగ్రవర్ణాలను గద్దె దింపి బహుజనులు రాజ్యాధికారం సాధించుకునేలా ప్రతిఒక్కరిలో చైతన్యం రావాలన్నారు.