జీపీఎఫ్ ఉఫ్..
ABN , First Publish Date - 2022-06-29T09:42:45+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90వేల మంది ఉద్యోగులు... వారికి చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్ నిధులు మాయమైపోయాయి!
- రూ.800 కోట్ల ఉద్యోగుల సొమ్ము మాయం
- వారికి తెలియకుండానే లాగేసుకున్న ఏపీ ప్రభుత్వం
- రెండు డీఏల సొమ్ము వేసినట్లే వేసి... వెనక్కి
- 90 వేల మంది ఉద్యోగులకు జగన్ సర్కారు ఝలక్
(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90వేల మంది ఉద్యోగులు... వారికి చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్ నిధులు మాయమైపోయాయి! ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆ సొమ్మును లాగేసుకుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉండగా.... ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం కలకలం సృష్టిస్తోంది. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్ వార్షిక స్టేట్మెంట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ లావాదేవీలను చూసుకున్న ఉద్యోగులకు అసలు సంగతి తెలిసింది. తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే సొమ్ము డెబిట్ అయినట్లు తేలింది. డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది.
తమ ఖాతాల్లో డబ్బులు విత్డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో ఈ విషయాన్ని ఉద్యోగులు, సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇదంతా గతం! తాజాగా... సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అవుతున్నట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. సోమవారం అకౌంట్టెంట్ జనరల్(ఏజీ) తమ వెబ్సైట్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ జీపీఎఫ్ ఖాతాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్లిప్పులు అందుబాటులో ఉంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు తమ జీపీఎఫ్ ఖాతాల్లో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు చూసుకున్నారు. డీఏ బకాయిల రూపంలో తమ ఖాతాల్లో జమ అయిన జీపీఎఫ్ సొమ్ము మళ్లీ మాయమైనట్లు గుర్తించారు. డీఏ ఎరియర్స్ బకాయిలు చెల్లించినట్లే చెల్లించి తమకు తెలియకుండానే ఖాతాల్లో సొమ్ము మాయం చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు.
నాయకుడి ఖాతా నుంచీ...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ జీపీఎఫ్ ఖాతా నుంచి కూడా రూ. 83 వేలు విత్డ్రా అయ్యాయి. కాగా, ఆర్థిక శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారు.