రూ.34,615 కోట్ల బ్యాంకింగ్‌ మోసం

ABN , First Publish Date - 2022-06-23T07:56:46+05:30 IST

బ్యాంకులకు ఏకంగా రూ.34,615 కోట్లు ఎగవేసిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌తో (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌) పాటు దాని మాజీ సీఎండీ కపిల్‌ వాధవాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధవాన్‌ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

రూ.34,615 కోట్ల బ్యాంకింగ్‌ మోసం

వాధవాన్‌లపై సీబీఐ కేసు 

ముంబైలోని 12 ప్రాంతాల్లో సోదాలు  

దేశంలో ఇదే అతిపెద్ద బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ 


న్యూఢిల్లీ: బ్యాంకులకు ఏకంగా రూ.34,615 కోట్లు ఎగవేసిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌తో (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌) పాటు దాని మాజీ సీఎండీ కపిల్‌ వాధవాన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధవాన్‌ తదితరులపై  సీబీఐ కేసు నమోదు చేసింది. అమరిల్లిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టితోపాటు మరో 8 మంది బిల్డర్ల పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. సీబీఐ ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్న అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసం ఇదే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి, ముంబైలోని 12 ప్రాంతాల్లో 50 మందికి పైగా అధికారుల బృందం బుధవారం సోదాలు నిర్వహించింది. గతంలో నమోదైన మరో మోసం కేసులో వాధవాన్‌ సోదరులు ఇప్పటికే జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.


యూబీఐ ఫిర్యాదు ఆధారంగా కేసు 

బ్యాంక్‌ల కన్సార్షియానికి నేతృత్వం వహిస్తున్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఫిర్యాదు మేరకు డీహెచ్‌ఎ్‌ఫఎల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఎన్‌బీఎ్‌ఫసీకి 2010-18 మధ్యకాలంలో బ్యాంక్‌ల కన్సార్షియం రూ.42,871 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్లైన వాధవాన్‌ సోదరులు ఇతరులతో కలిసి కుట్రపన్ని వాస్తవాలను దాచడంతోపాటు బ్యాంక్‌లను తప్పుదోవ పట్టించారని యూబీఐ ఆరోపించింది. విశ్వాసఘాతుకానికి పాల్పడడం, కన్సార్షియాన్ని మోసం చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చారని ఫిర్యాదులో పేర్కొం ది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ 2019 నుంచి రుణాల చెల్లింపులను నిలిపివేసిందని తెలిపింది. అప్పటికి బ్యాంక్‌లకు సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.36,614 కోట్లు.

 

రుణ నిధులు మళ్లించి ఆస్తులు పోగేసుకున్నారు..

ఆర్థిక అవకతవకలు, నిధుల దారి మళ్లింపు, పద్దు పుస్తకాల్లో కల్పిత ఎంట్రీలతోపాటు రుణ నిధుల రౌండ్‌ ట్రిప్పింగ్‌కు పాల్పడటం ద్వారా వాధవాన్‌ సోదరులు సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారని డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ అకౌంట్స్‌ ఆడిటింగ్‌లో తేలింది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్లు డొల్ల కంపెనీల సాయం తో నిధులను దారి మళ్లించారని 2019 జనవరిలో ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ కోబ్రాపోస్ట్‌ కఽథనం ఆరోపించింది. ఆ ఆరోపణల నేపథ్యంలో బ్యాంక్‌ల కన్సార్షియం 2019 ఫిబ్రవరి 1న సమావేశమై, 2015 ఏప్రిల్‌ నుంచి 2018 అక్టోబరు కాలానికి డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ పద్దులపై ఆడిటింగ్‌ జరిపించాలని నిర్ణయించాయి. ఆడిటింగ్‌ బాధ్యతలను కేపీఎంజీకి అప్పగించాయి. అంతేకాదు, వాధవాన్‌ సోదరులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న బ్యాంక్‌లు వారిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేశాయి. సన్నిహితులు, సంబంధిత వర్గాల సంస్థలకు రుణాలు లేదా ఫైనాన్స్‌ రూపంలో డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్లు నిధుల మళ్లింపునకు పాల్పడ్డారని కేపీఎంజీ ఆడిటింగ్‌లో తేలిందని యూబీఐ ఫిర్యాదులో పేర్కొంది.  


పిరామల్‌ హస్తగతమైన డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ 

దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ గత ఏడాది సెప్టెంబరులో పిరామల్‌ గ్రూప్‌ హస్తగతమైంది. ఈ దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ రుణదాతలకు (ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారులు సహా) మొత్తం రూ.38,000 కోట్లు రికవరీ అయ్యాయి.


బాంద్రా బుక్స్‌పై సీబీఐ దర్యాప్తు

డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ రూ.14,000 కోట్లకు పైగా విలువైన 1,81,664 నకిలీ రుణ ఖాతాల వివరాలను బాంద్రా బుక్స్‌ పేరుతో ప్రత్యేక అకౌంట్స్‌ డేటాబే్‌సలో భద్రపరిచిందని యూబీఐ తన ఫిర్యాదులో పేర్కొంది. వాధవాన్‌ సోదరుల ఆర్థిక అవకతవకల గుట్టు విప్పడంలో కీలకమైన ఈ బుక్స్‌పై సీబీఐ దర్యాప్తు చేయనుంది. 

Updated Date - 2022-06-23T07:56:46+05:30 IST