వాటాదారులకు రూ.24,100 కోట్లు పంచాం..

ABN , First Publish Date - 2022-06-26T08:19:05+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇన్ఫోసిస్‌ తన వాటాదారులకు రూ.24,100 కోట్ల మేర రిటర్నులు పంచిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నందన్‌ నీలేకని తెలిపారు.

వాటాదారులకు రూ.24,100 కోట్లు పంచాం..

ఏజీఎంలో ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నీలేకని 

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇన్ఫోసిస్‌ తన వాటాదారులకు రూ.24,100 కోట్ల మేర రిటర్నులు పంచిందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నందన్‌ నీలేకని తెలిపారు. గతసారి కంపెనీ రూ.11,000 కోట్లకు పైగా సంస్థ షేర్ల బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు)తో పాటు ఒక్కో షేరుకు రూ.31 చొప్పున మొత్తం రూ.13,000 కోట్ల డివిడెండ్‌ పంచిందన్నారు. శనివారం జరిగిన 41వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆయన సంస్థ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ అసాధారణ వృద్ధిని నమోదు చేసుకుందని, స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయం 19.7 శాతం వృద్ధి చెంది 1,630 కోట్ల డాలర్లకు పెరిగిందన్నారు. గడిచిన 11 ఏళ్లలో కంపెనీకిదే అత్యంత వేగవంతమైన వృద్ధి అని నీలేకని పేర్కొన్నారు. 


యువతకు అగ్నిపథ్‌ గొప్ప అవకాశం: కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం భారత యువతకు గొప్ప అవకాశమని నీలేకని కొనియాడారు. అత్యంత క్రమశిక్షణతో కూడిన ఆవరణలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు యువతకు ఇది గొప్ప అవకాశంతో పాటు భవిష్యత్‌ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ పథకం దోహదపడనుందన్నారు. ఇన్ఫోసిస్‌ మానవ వనరులను పెంచుకునేందుకు ఎదురుచూస్తుందని, కంపెనీ సొంత ఎంపిక ప్రక్రియను అనుసరించనుందన్నారు. ‘అగ్నివీర్‌’లకు కంపెనీలో ఉద్యోగావకాశం కల్పించే ఆలోచనేమైనా ఉందా..? అని ఏజీఎంలో ఓ వాటాదారు అడిగిన ప్రశ్నకు నీలేకని పైవిధంగా సమాధానమిచ్చారు. 

Updated Date - 2022-06-26T08:19:05+05:30 IST