ED Cash Seized : మంత్రి అనుచరుడి ఇంట్లో రూ.20 కోట్ల నోట్ల కట్టల గుట్ట.. అన్నీ రూ.500, రూ.2000 నోట్లే..

ABN , First Publish Date - 2022-07-23T02:51:27+05:30 IST

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) మంత్రి పార్థ చటర్జీ(Partha Chatterjee) అనుచరుడు అర్పి

ED Cash Seized : మంత్రి అనుచరుడి ఇంట్లో రూ.20 కోట్ల నోట్ల కట్టల గుట్ట.. అన్నీ రూ.500, రూ.2000 నోట్లే..

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) మంత్రి పార్థ చటర్జీ(Partha Chatterjee) అనుచరుడు అర్పిత ముఖర్జీ(Arpita Mukherjee) ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఏకంగా రూ.20 కోట్ల నోట్ల కట్టలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఈ భారీ నగదు గుర్తించారు. వెస్ట్‌బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అవకతవకులకు సంబంధించిన ‘ఎస్ఎస్‌సీ మోసం’ కేసులో సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ డబ్బు దొరికింది. దర్యాప్తులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు.


అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.20 కోట్ల నగదు పట్టుబడిందని, ఈ డబ్బంతా ఎస్ఎస్‌సీ స్కాంలో కూడబెట్టినదిగా అనుమానిస్తున్నామని అధికారులు తెలిపారు. నగదు లెక్కించే విషయంలో బ్యాంక్ అధికారుల సాయం తీసుకున్నామని, క్యాష్ కౌంటింగ్ మెషిన్లను ఉపయోగించామని చెప్పారు. అర్పిత ముఖర్జీ ఇంటి ప్రాంగణంలో 20కిపైగా ఫోన్లను రికవరీ చేసుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ స్కాంతో సంబంధమున్న రికార్డులు,  నేరానికి పాల్పడ్డ డ్యాక్యుమెంట్లు, కంపెనీల నకిలీ వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ నగదు, బంగారాన్ని వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు.  కాగా ఈడీ విడుదల చేసిన ఫొటోల్లో అన్నీ రూ.500, రూ.2000 నోట్లే కనిపిస్తున్నాయి. 


కాగా ఎస్‌ఎస్‌సీ స్కాంతో సంబంధమున్న పశ్చిమబెంగాల్ మంత్రి, టీఎంసీ లీడర్ పార్థ ఛటర్జీ కోసం అన్వేషిస్తున్నట్టు ఈడీ అధికారులు చెప్పారు. గతంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేయగా ప్రస్తుతం వాణిజ్య, పరిశ్రమశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు  విద్యాశాఖ సహాయమంత్రి పరేష్ అధికారి నివాసంలో కూడా సోదాలు మొదలు పెట్టామని వివరించారు. కాగా ఎస్‌ఎస్‌సీ స్కాంలో నాన్-టీచింగ్ స్టాఫ్(గ్రూప్ సీ, డీ), టీచింగ్ స్టాఫ్(9-12 తరగతులకు అసిస్టెంట్ టీచర్స్), ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో చట్టవిరుద్ధంగా నియామకాలు చేపట్టారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు జరుపుతోంది.

Updated Date - 2022-07-23T02:51:27+05:30 IST