రూ.17.34 కోట్ల బకాయిలు
ABN , First Publish Date - 2022-06-30T06:37:39+05:30 IST
జిల్లాలో ఇప్పటివరకు 17,387 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా అందుకోసం రైతులకు ప్రభుత్వం రూ 33.79కోట్లు చెల్లించాల్సి ఉంది.
నేటితో ముగియనున్న ధాన్యం కొనుగోళ్లు
ఇప్పటివరకు కొన్నది 17,386 మెట్రిక్ టన్నులు
సకాలంలో డబ్బులు రాక అల్లాడుతున్న రైతులు
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 29: జిల్లాలో ఇప్పటివరకు 17,387 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా అందుకోసం రైతులకు ప్రభుత్వం రూ 33.79కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.16.45 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17.34 కోట్లు బకాయి ఉంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. రెండు నెలల నుంచి రబీ సీజన్కు సంబంధించిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి జిల్లాలోని 50 రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నా రైతులకు సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా రైతుల వద్ద ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలు కాని పరిస్థితి ఏర్పడింది. ముందుగా అవసరాల కోసం ధాన్యం అమ్ముకున్న వారికి సకాలంలో డబ్బులు పడకపోవడంతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.