రూ.10 బయానా.. రూ.లక్షల చేసే జీవాల తరలింపు

ABN , First Publish Date - 2021-10-25T05:49:39+05:30 IST

జీవాల యజమానులకు రూ.10లు బయాన కింద ఇచ్చి డబ్బులివ్వకుండా 135 గొర్రెలను కాజేయాలనుకున్న ఇద్దరు అనంతపురం జిల్లా మోసగాళ్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

రూ.10 బయానా..   రూ.లక్షల చేసే జీవాల తరలింపు
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

ఇద్దరు మోసాగాళ్ల అరెస్టు

విస్సన్నపేట, అక్టోబరు 24: జీవాల యజమానులకు రూ.10లు బయాన కింద ఇచ్చి డబ్బులివ్వకుండా 135 గొర్రెలను కాజేయాలనుకున్న ఇద్దరు అనంతపురం జిల్లా మోసగాళ్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు విస్సన్నపేట పోలీ్‌సస్టేషన్‌లో జరిగిన మోసాన్ని వివరించారు. అనంతపురం గ్రామానికి చెందిన గోగుల శివయ్య, గోగుల నారాయణస్వామి గత నెల 28న తాతకుంట గ్రామానికి వచ్చి గుంట్రు చిట్టిబాబు వద్ద 38 గొర్రెలను రూ.5.11 లక్షలకు, నక్కనబోయిన నరసింహస్వామి వద్ద 55 జీవాలను రూ.6.05 లక్షలకు, చాట్రాయి మండలం చిత్తాపుర్‌లో అరుమళ్ల పిచ్చయ్య వద్ద 42 గొర్రెలను రూ.4.62 లక్షలకు కొనుగోలు చేసి ముగ్గురికీ రూ.10ల చొప్పున బయానా కింద ఇచ్చారు. మిగిలిన డబ్బులు అనంతపురం జిల్లా ధర్మవరం వెళ్లిన తర్వాత ఇస్తామని వారిని నమ్మించారు. గొర్రెలను రెండు లారీలకు ఎక్కించి పెనుగొండలో ఓలాడ్జిలో వారిని ఉంచి డబ్బులు తెస్తామని చెప్పి గొర్రెలతో పాటు పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు విజయవాడ బస్టాండ్‌ అవుట్‌ గేటు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా అసలు విషయం బయట పడింది. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.11.15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన తిరువూరు సీఐ శేఖర్‌బాబు, ఎస్సై పి.కిషోర్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులకు సిఫారసు చేశారు. 


Updated Date - 2021-10-25T05:49:39+05:30 IST