గేల్ సునామీ.. రాజస్థాన్ ఎదుట భారీ విజయ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-31T03:01:27+05:30 IST

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా అర్చర్ వేసిన తొలి ఓవర్ చివరి

గేల్ సునామీ.. రాజస్థాన్ ఎదుట భారీ విజయ లక్ష్యం

అబుదాబి: కీలక మ్యాచ్‌లో పంజాబ్ రాణించింది. యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా అర్చర్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ మన్‌దీప్ సింగ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌తో కలిసి కెప్టెన్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి తొలుత నిదానంగా ఆడుతూ కుదురుకునే ప్రయత్నం చేశారు. పాతుకుపోయిన తర్వాత బ్యాట్ ఝళిపించారు. ఓవైపు రాహుల్ నెమ్మదిగా ఆడుతుంటే గేల్ మాత్రం పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు.


 అయితే, అంతకంటే ముందు గేల్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఇక వెనుదిరిగి చూడలేదు. బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తూ బౌలర్లను ఊచకోత కోశాడు. మరోవైపు 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రాహుల్ స్టోక్స్ బౌలింగులో భారీ షాట్‌కు యత్నించి తెవాటియాకు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన నికోల్ పూరన్ ఎదుర్కొన్నది 10 బంతులే అయినా 3 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు.


మరోవైపు చివరి ఓవర్‌ మూడో బంతికి సిక్సర్ కొట్టిన గేల్ 99 పరుగులకు చేరుకున్నాడు. దీంతో సెంచరీ ఖాయమనే అందరూ అనుకున్నారు. అయితే అర్చర్ వేసిన నాలుగో బంతిని ఆడే ప్రయత్నంలో బౌల్డయ్యాడు. దీంతో సెంచరీకి ఒక్క పరుగు ముందు అతడి ఇన్నింగ్స్ ముగిసింది. చివరి రెండు బంతులకు చివరి రెండు బంతుల్లో ఒక్కటే పరుగు వచ్చింది. దీంతో 185 పరుగుల వద్ద పంజాబ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 63 బంతులు ఎదుర్కొన్న గేల్ 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ 6, హుడా ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. 

Updated Date - 2020-10-31T03:01:27+05:30 IST