సెంచరీతో రాహుల్ వీర విహారం.. బెంగళూరు టార్గెట్ 207

ABN , First Publish Date - 2020-09-25T03:17:01+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా జరుగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో...

సెంచరీతో రాహుల్ వీర విహారం.. బెంగళూరు టార్గెట్ 207

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా జరుగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ బ్యాట్‌తో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు నుంచి ఓపెనర్‌గా మయాంక్‌తో కలిసి బరిలోకి దిగిన రాహుల్ 10 ఓవర్లు ముగిసే వరకూ నిలకడగా రాణిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత రాహుల్ మరింత చెలరేగాడు.


మ్యాచ్ ముగిసే సమయానికి 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 132 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. అయితే.. రాహుల్ కొట్టిన రెండు షాట్లను బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జారవిడచడంతో వచ్చిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకుని భారీ స్కోర్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో రాహుల్‌దే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు, చివరి 4 ఓవర్లలో పంజాబ్ జట్టు 74 పరుగులు చేసిందంటే స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో ఎలా హోరెత్తిందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2020-09-25T03:17:01+05:30 IST