రౌడీషీటర్లు వస్తే ఏం పీకుతున్నావ్‌

ABN , First Publish Date - 2022-04-28T09:39:26+05:30 IST

వికారాబాద్‌ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది.

రౌడీషీటర్లు వస్తే  ఏం పీకుతున్నావ్‌

తాండూరు పట్టణ సీఐను పచ్చిబూతులతో దూషించిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి 

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ 

ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేసిన సీఐ


తాండూరు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్‌ 23న (శనివారం) తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నా.. సీఐ రాజేందర్‌రెడ్డి వారించలేదనే ఆగ్రహంతోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఈ ఫోన్‌కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్‌లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి,  సీఐ రాజేందర్‌రెడ్డి మధ్య సంభాషణ ఇలా సాగింది.. ‘‘రౌడీ షీటర్లు వస్తే ఎట్లా ఊకున్నవ్‌. మరి నీవేం పీకుతున్నవ్‌’’ అని ఎమ్మెల్సీ అనగా.. ‘‘సార్‌ మంచిగా మాట్లాడండి’’ అని సీఐ అన్నారు.

దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్సీ పచ్చి బూతులు తిడుతూ ‘‘ ఏం పీకుతున్నావ్‌ రా...అరేయ్‌ రికార్డు చేయ్‌రా... కార్పెట్‌ వేస్తే ఏం చేస్తున్నావ్‌రా’’ అని ప్రశ్నించారు. దీనికి సీఐ స్పందించి.. ‘‘కార్పెట్‌ వేసే పని.. మాదా సార్‌ ?’’ అని బదులిచ్చారు. ‘‘రౌడీ షీటర్లకు ఎలా కార్పెట్‌ వేస్తారు?’’ అని ఎమ్మెల్సీ మరోసారి ప్రశ్నించారు. దీంతో ‘‘ఎమ్మెల్యే.. రౌడీ షీటరా?’’ అని సీఐ తిరిగి ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యే వెంట ఉన్నవాళ్లు ఎవర్రా.. ? నువ్వు అనుకోవచ్చు బిడ్డా.. సీఐగా ఇక్కడి నుంచి వెళ్లిపోయినా నీ తాట తీస్తా.. రేపటి నుంచి నీ సంగతి చూస్తా’’ అంటూ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి  సీఐని హెచ్చరించారు. దీనిపై సీఐ రాజేందర్‌రెడ్డిని వివర ణ కోరగా.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీపై తాండూరు పీఎ్‌సలోనూ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ‘‘సీఐపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. సీఐ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా. అవసరమైతే హైకోర్టుకు ఎక్కుతా’’  అని చెప్పారు. కాగా,  ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు బుధవారం రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు.  


మహేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: తాండూరు సీఐని అసభ్యకర పదజాలంతో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ బేషరుతుగా సీఐకి క్షమాపణలు చెప్పాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-04-28T09:39:26+05:30 IST