అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు
ABN , First Publish Date - 2022-01-20T05:15:03+05:30 IST
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు
గజపతినగరం : అంగన్వాడీ కేంద్రాలు ద్వారా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు నాణ్య మైన పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ... ఆ దిశగా చర్యలు సాగడం లేదు. మండలంలో 62 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతీనెలా ప్రభుత్వ ఆదేశా ల మేరకు ఏజెన్సీల ద్వారా గుడ్లు సరఫరా జరుగుతుంది. అయితే సకాలంలో అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల కు, గర్భిణులకు, బాలింతలకు అందించకపోవడంతో గుడ్లు కుళ్లిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమేతోనే ఈ పరిస్థితి నెలకొందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పురిటిపెంట గ్రామ పంచాయతీకి సంబంధించి అంగన్వాడీ-2 కేంద్రంలో కుళ్లిన గుడ్లు దర్శమిస్తున్నాయి. ఈ నెల 10న కేంద్రానికి గుడ్లు సరఫరా అయినప్పటికీ అంగన్వాడీ కార్యకర్త, ఆయా లు లబ్ధిదారులకు అందించకపోవడంతో కొన్ని ఎలుకలు తినేయగా, మరికొన్ని గుడ్లు కుళ్లిపోయి పురుగులు పట్టాయి. దీంతో గర్భిణులు, బాలింతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాని కి కూతవేటు దూరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోనే పరిస్థితి ఇలాఉంటే మిగిలిన కేంద్రాల్లో దుస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పురిటిపెంట-2,3 కేంద్రాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్త సూర్య కుమారి బాధ్యతుల నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం ఎటువంటి సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమణకుమారిని వివరణ కోరగా... అంగన్వాడీ కార్యకర్త తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేని, సెలవు కూడా అడగలేదని తెలిపారు. సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు మెమో జారీ చేస్తామన్నారు. అలాగే గజపతినగరం-3, 4 కేంద్రాల్లో ఆయాలు కూడా విధులకు డుమ్మా కొట్టినట్టు సమాచారం ఉందని స్పష్టం చేశారు.