ఎర్రగులాబీలకు భారీగా డిమాండ్!

ABN , First Publish Date - 2020-02-13T16:11:02+05:30 IST

ప్రేమికుల దినోత్సవానికి గార్డెన్‌ సిటీ సన్నద్దమైంది. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో

ఎర్రగులాబీలకు భారీగా డిమాండ్!

బెంగళూరు : ప్రేమికుల దినోత్సవానికి గార్డెన్‌ సిటీ సన్నద్దమైంది. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఎర్ర గులాబీలకు భారీగా డిమాండ్‌ నెలకొని వుంది. గత ఏడాదితో పోలిస్తే గులాబీల ధర 15 శాతం పెరిగినప్పటికీ డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదని బెంగళూరు అంతర్జాతీయ పుష్పాల వేలం కేంద్రం అధికారి వి.ఎస్‌.మిథున్‌ వెల్లడించారు. బెంగళూరు నగరం నుంచి ఎప్పటిలాగే ఇతర రాష్ట్రాలకు గులాబీలను ఎగుమతి చేస్తున్నా మన్నారు.


ఒక వారం నుంచే లక్షలాది గులా బీలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయన్నారు. బెంగళూరు నగర చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని తోటల్లో పండించే ఎర్రగులాబీలకే ఎక్కువ డిమాండ్‌ ఉందన్నారు. ఫిబ్రవరి 10 నాటికి రోజూ 10 లక్షల గులాబీ పువ్వులను ఎగుమతి చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రస్తుతం రోజూ 5 లక్షల గులాబీలు ఎగమతి చేస్తున్నామన్నారు. రైతులకు ఉత్పాదనా ఖర్చులు కలిపి ఒక్కో గులాబీ ధర 2 రూపాయలుగా ఉంటుందని, వేలం కేంద్రంలో 5 రూపాయల వరకు ధర పలుకుతుందన్నారు. ఈ పువ్వు మార్కెట్‌లోకి అడుగు పెట్టే సమయానికి ఒక్కో పువ్వు రూ.10 నుంచి 20 రూపాయల ధర పలుకు తుందన్నారు. ప్రేమికుల దినోత్సవం సమ యంలో ఈ ధర ఇంకొంచెం అధికంగా ఉం టుందన్నారు.

 

సీజన్‌ ఇదే... 

గులాబీ పూలకు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మార్కెట్‌ అధికంగా ఉంటుంది. ఈ నాలుగు నెలల్లోనే గులాబీ రైతులకు భారీగా లాభాలు లభిస్తుంటాయి. నవంబర్‌ నెల నుంచి వివాహాది శుభ కార్యాలు ప్రారంభం కావడంతో గులాబీలకు భారీ డిమాండ్‌ ఉంటుంది. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గులాబీల విక్రయం జరుగుతుందని మిథున్‌ వెల్లడించారు. 


తాజ్‌మహల్‌కే డిమాండ్‌ ఎక్కువ

గులాబీలలో ప్రముఖంగా 8 రకాలు ఉన్నప్పటికీ తాజ్‌మహల్‌ రకం గులాబీలకే డిమాండ్‌ అధికంగా ఉంది. సాధారణ రోజుల్లోనూ ఈ గులాబీ పువ్వు ధర రూ.20 పైచిలుకు ఉంటుందని మిథున్‌ వివరించారు. గులాబీలలో తాజ్‌మహల్‌తో పాటు హాట్‌ షాట్‌, కార్వేట్‌, రాక్‌స్టార్‌, బ్రిలియంట్‌, ఫస్ట్‌ రెడ్‌, గ్రాండ్‌ గల రకాలు, బహుళ ప్రజాదరణ పొందాయన్నారు. అయితే తాజ్‌మహల్‌ గులాబీలకు మాత్రం డిమాండ్‌ అధికంగా ఉంటుందన్నారు. 


ఎక్కడెక్కడ పండిస్తారంటే.. 

గులాబీ తోటలు బెంగళూరు నగర శివారులోని దొడ్డబళ్ళాపురంలో అధికంగా ఉన్నాయి. ఇక్కడ 100కు పైగా గులాబీ తోటలు ఉన్నాయి. బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోకి వచ్చే నెలమంగళలోనూ గులాబీ తోటలు అధికంగా ఉన్నాయి. ఇక చిక్క బళ్ళాపురం, తుమకూరు, మండ్య, చామరాజ నగర్‌, కొడగు, తమిళనాడులోని హోసూరులలో కూడా గులాబీ తోటలు అధికంగా ఉన్నాయి. బెంగళూరు నుంచి గులాబీలు ఢిల్లీ, కోల్‌కత్తా, హైదరాబాద్‌తో సహా మొత్తం 190 ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయన్నారు. గులాబీ వేలం కేంద్రం ఏర్పాటు అయ్యాక రోజూ 40 లక్షల టర్నోవర్‌ నిర్వహిస్తున్నారు. 48 రకాల గులాబీలు సగటున ఈ కేంద్రానికి వస్తుంటాయి. వీటిలో 5 రూపాయల నుంచి 25 రూపాయలు విలువ చేసే గులాబీలు కూడా ఉన్నాయని మిథున్‌ తెలిపారు.

Updated Date - 2020-02-13T16:11:02+05:30 IST