భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఇంటి మీద పడిన రాకెట్.. భారతీయురాలి మృతి!
ABN , First Publish Date - 2021-05-13T00:50:07+05:30 IST
భర్తతో వీడియో కాల్ మాట్లాడే సమయంలో ఇంటిపై కూలిన రాకెట్ ఒక ప్రవాస భారతీయురాలి ప్రాణాలు బలితీసుకుంది.
ఆష్కెలాన్: భర్తతో వీడియో కాల్ మాట్లాడే సమయంలో ఇంటిపై కూలిన రాకెట్ ఒక ప్రవాస భారతీయురాలి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన ఇజ్రాయెల్ దేశంలోని ఆష్కెలాన్లో వెలుగు చూసింది. కేరళలోని ఇదుక్కి జిల్లాకు చెందిన సౌమ్య సంతోష్.. భర్తతో కలిసి ఇజ్రాయెల్లో ఉంటోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఎప్పటి నుంచో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ ఘర్షణల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే గాజా నుంచి పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేశారు.
అలా చేయగా వచ్చిన ఒక రాకెట్ సౌమ్య ఉన్న ఇంటిపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో సౌమ్య.. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 30 ఏళ్ల సౌమ్య గడిచిన ఏడేళ్లుగా ఇజ్రాయెల్లోనే నివశిస్తోందని కుటుంబం చెప్పింది.