ప్రమాదకరంగా రహదారులు

ABN , First Publish Date - 2020-11-23T05:33:11+05:30 IST

ప్రమాదకరంగా రహదారులు

ప్రమాదకరంగా రహదారులు
చెరువు కట్టమీది నుంచే మేడ్చల్‌-గౌడవెల్లి మార్గం

  • చెరువు కట్టపై నుంచే రోడ్డు మార్గాలు  
  • రక్షణ చర్యలు శూన్యం 
  • తరచూ ప్రమాదాలు 
  • పట్టించుకోని సంబంధిత అధికారులు


మేడ్చల్‌:  మేడ్చల్‌ మండలంలోని పలు గ్రామాలను కలిపే లింకు  రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రధానంగా చెరువుకట్టలపై నుంచి వేసిన రోడ్లు ప్రమాదాలను తలపించే విధంగా మారటంతో ఇక్కడ తరచూ వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. మండలంలోని గుండ్లపోచంపల్లి అయోధ్య చౌరస్తా నుంచి గౌడవెల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు ఒక చెరువు కుంట కట్టపై నుంచి ఏర్పాటు చేయటంతో ఈ రోడ్డుపై నుంచి ప్రయాణించే వాహనాలు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి కంచె గాని, హద్దులు కాని రక్షణగా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవటంతో వాహనాలు అదుపుతప్పి చెరువుకుంటలోకి జారుతున్నాయి. మేడ్చల్‌ పట్టణం నుంచి గౌడవెల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పట్టణంలోని ఎరుకల బస్తీ సమీపంలోని చెరువు కట్టపై నుంచి ఏర్పాటు చేయటంతో ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కట్ట ఎత్తుగా ఉండటంతో పాటు కట్ట ఇరువైపులా ఎలాంటి  రక్షణ కంచె లేక పోవటంతో చాలామంది ద్విచక్రవాహనదారులు రాత్రి వేళ ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ రోడ్డు వెడల్పు చిన్నగా ఉండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కట్ట దాటి ముందుకు పోని స్థితిలో ఈ రోడ్డు ఉంది. కట్టను వెడల్పు చేసి ఇరువైపులా ప్రమాదాలు జరగకుండా హద్దులు ఏర్పాటు చేసేందుకు వీలునప్పటికీ అధికారులు మాత్రం కట్టపై థారురోడ్డును వేసి వదిలేశారు. ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుకిరువైపులా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-11-23T05:33:11+05:30 IST