ఊరిలో గుంతలు పూడ్చేందుకే రోడ్లు తవ్వేశారట!
ABN , First Publish Date - 2021-07-28T08:47:03+05:30 IST
అమరావతిలోని గ్రావెల్ రోడ్లను తవ్వేస్తున్న వారిని రెండు రోజుల క్రితం ఆ ప్రాంత దళిత జేఏసీ నేతలు వెంటబడి ..
గ్రావెల్ దొంగలను అడ్డగోలుగా వెనకేసుకొచ్చిన పోలీసులు
గుంటూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని గ్రావెల్ రోడ్లను తవ్వేస్తున్న వారిని రెండు రోజుల క్రితం ఆ ప్రాంత దళిత జేఏసీ నేతలు వెంటబడి తరిమిన విషయం మీడియాలో రావడమే కాకుండా సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తోంది. దీనిపై గుంటూరు రూరల్ ఎస్పీ ట్విటర్లో స్పందించారు. ఎవరూ రాజధానిలోని రోడ్లను తవ్వి గ్రావెల్ అమ్ముకోలేదని, ఉద్దండరాయునిపాలెంలోని రోడ్లు ఇటీవల వర్షాలకు పాడైపోయి గుంతలు పడ్డాయని, వాటిని పూడ్చుకునేందుకే రాజధాని రోడ్లను తవ్వుకొని గ్రావెల్ను తీసుకు వెళ్లారని, వాస్తవం తెలుసుకోకుండా అభూత కల్పనలకు ప్రచారం కల్పించవద్దని హెచ్చరించారు. దీనిపైనా సోషల్ మీడియాలో కామెంట్లు హల్చల్ చేస్తున్నాయి. ‘పాడైన రోడ్లకు ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు. ప్రజలే వేరే చోట బాగున్న రోడ్ల ను తవ్వి గ్రావెల్ను తెచ్చుకుని తమ రోడ్లను బాగుచేసుకోవాలనే సందేశాన్ని పోలీసులు ఇచ్చారు’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.