దారి ధ్వంసం
ABN , First Publish Date - 2021-07-23T04:49:02+05:30 IST
అసలే గుంతల రహదారులు.. దానికి తోడు భారీ వర్షం.. ఇంకేముంది దారి ధ్వంసమైంది.
వర్షాలతో రహదారులు ఛిద్రం
కొవ్వూరు / జంగారెడ్డిగూడెం టౌన్ / ద్వారకాతిరుమల
అసలే గుంతల రహదారులు.. దానికి తోడు భారీ వర్షం.. ఇంకేముంది దారి ధ్వంసమైంది. వాహనదారులతోపాటు కాలినడకన వెళ్లేవారు సైతం నీరు నిండిన గోతుల్లో పడి గాయ పడుతున్నారు. ఏలూరు – గుండుగొలను – కొవ్వూరు రాష్ట్ర రహదారిపై గామన్ వంతెన జంక్షన్ నుంచి గోదావరి మాత విగ్రహం, రోడ్డు కం రైలు బ్రిడ్జి టోల్గేట్ వరకు పెద్ద పెద్ద గోతులు భయపెడుతున్నాయి. కొవ్వూరు పట్టణ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం, ఫైర్స్టేషన్ ఎదురుగా, రైల్వేస్టేషన్, వేగివారి చావిడి, వాటర్ ట్యాంకు ఏ రోడ్డు చూసిన గోతులతో రహదారి ఛిద్రమైంది. జంగారెడ్డిగూడెం – కేంద్రం ఏలూరు ప్రధాన రహదారిపై ప్రయాణం చేయలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. బస్టాండ్ నుంచి మద్ది క్షేత్కం వరకు రహదారి గోతులమయం. బస్టాండ్ సమీపంలో ఆటోనగర్ వద్ద రోడ్డుపై గోతిలో ప్రమాద సూచికగా కర్ర పాతి ఎర్రటి గుడ్డ ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు రోడ్డుపై గోతులతో అష్టకష్టాలు పడుతున్నారు. వెంకన్నతోపాటు దేవుళ్లందరినీ తలచుకోవాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోరు కదా..!