ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2021-01-21T06:34:38+05:30 IST
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ హెచ్చరించారు.
డ్రైవర్లకు ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ హెచ్చరిక
పాడేరు, జనవరి 20: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ హెచ్చరించారు. జీపులు, ఆటోల డ్రైవర్లను తన కార్యాలయానికి రప్పించి మాట్లాడారు. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను నిలుపుదల చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా తీరు మార్చుకోవడం లేదని డ్రైవర్లపై ఆగ్రహం చెందారు. జీపులను ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలో, ఐటీడీఏ కార్యాలయం పరిసరాల్లో నిలుపుదల చేయవద్దన్నారు. వాహనాల నిలుపుదలకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించామని దానిని వినియోగించుకోవాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో కె.నాగేశ్వరరావు, ఎస్ఐ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.