కొత్త వాహనాలపై రోడ్సేఫ్టీ సెస్!
ABN , First Publish Date - 2022-05-12T09:06:01+05:30 IST
వాహనదారులపై చడీ చప్పుడు లేకుండా పన్నులు పెంచిన రవాణా శాఖ.
- కొనుగోలు చేసే ప్రతి వాహనంపైనా వసూలు..
- రవాణా శాఖ నిర్ణయం.. త్వరలో ఉత్తర్వులు!
- టూవీలర్లకు 500, కార్లకు 2వేలు
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): వాహనదారులపై చడీ చప్పుడు లేకుండా పన్నులు పెంచిన రవాణా శాఖ.. తాజాగా కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్ సేప్టీ సెస్ను విధించాలని నిర్ణయించింది. కొత్తగా కొనుగోలు చేసే ప్రతి వాహనంపైనా ఈ సెస్ను వసూలు చేయనుంది. మోటారు సైకిల్, స్కూటర్, మోపెడ్ వంటి ద్విచక్ర వాహనాలకు రూ.500, కార్లకు రూ.2000, వాణిజ్య రంగ వాహనాలకు రూ.2500 దాకా రోడ్సేఫ్టీ సెస్ కింద వసూలు చేయనున్నట్టు తెలిసింది. గత వారం రోజులుగా వాహనాల లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, త్రైమాసిక ట్యాక్స్ను పెంచిన ప్రభుత్వం.. వాహనదారుల స్పందనను పరిశీలించిన మీదట రోడ్సేఫ్టీ సెస్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 714(ఇ) సర్య్కులర్తో ఆటోలు తదితర వాణిజ్య వాహనాల రీ-రిజిస్ట్రేషన్లకు జరిమానా భారం పెరిగిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రోడ్సేఫ్టీ సెస్ అమలుపై కొన్ని రోజుల తర్వాత ఉత్తర్వులు జారీ చే యాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పాత వాహనాలను క్రమంగా తప్పించి నూతన సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో రవాణా శాఖ పాత వాహనాలను స్ర్కాప్ కింద పరిగణించేందుకు గ్రీన్ ట్యాక్స్ను భారీగా పెంచిన విషయం తెలిసిందే. మోటారు సైకిల్, కారు వంటి వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల తర్వాత రీ-రిజిస్ట్రేషన్ సందర్భంలో రూ.2000, రూ.5000 చొప్పున గ్రీన్ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య వాహనాలను మూడు స్లాబ్లుగా పరిగణించి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు. 7 నుంచి 10 ఏళ్లకు రూ.5 వేలు, 10 నుంచి 12 ఏళ్లకు మరో రూ.5 వేలు, 12 ఏళ్ల తర్వాత మరో రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక లారీలకు ఇప్పటివర కు రూ.3 వేల వరకు ఉండగా ఇకపై స్లాబ్కు రూ.10 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.