బ్యారేజీపై ప్రయాణమా అమ్మో..
ABN , First Publish Date - 2022-08-10T06:23:27+05:30 IST
సర్ ఆర్డర్ కాటన్ ఎంతో ముం దుచూపుతో నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీని ధ్వంసం మైపోతోంది.
రోడ్డంతా గోతులే
ధవళేశ్వరం బ్యారేజీపై 7 కిలోమీటర్లు అధ్వానం
పడుతూ లేస్తూ వాహనదారుల ప్రయాణం
వరల్డ్ బ్యాంకు రూ.180 కోట్లిస్తామన్నా పట్టించుకోని సీఎం
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
సర్ ఆర్డర్ కాటన్ ఎంతో ముం దుచూపుతో నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీని ధ్వంసం మైపోతోంది. బ్యారేజీపై రోడ్డు పెద్ద పెద్ద గోతులతో వాహనాలు కదల్లేని స్థితిలో ఉంది. 175 గేట్లతో సుమారు 7 కిలోమీటర్లు పొడవు ఉన్న బ్యారేజీపై రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు మూడేళ్లగా రోడ్డంతా గోతుల మయంగా మారింది. ఓ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బ్యారేజీ రోడ్డుపై ఆందోళన చేయడానికి వస్తున్నానని ప్రకటించగానే, ఆయ నకు అనుమతివ్వకుండా కొన్ని గోతులు పూడ్చి వదిలేశారు. తర్వాత మళ్లీ ఈ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకూ మొత్తం బ్యారేజీ రోడ్డు పాడైపోయింది. కొన్ని చోట్ల గతంలో వేసిన తారురోడ్డు లేయర్లు లేచిపోయాయి. దీంతో పూర్వం వేసిన సీసీరోడ్డు బయట పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరల్డ్ బ్యాంకు కరుణించినా..
వరల్డ్బ్యాంకు ప్రతినిధులు గతేడాదిని బ్యారేజీని సందర్శించి సుమారు రూ.180 కోట్లు మం జూరు చేయడానికి అంగీకరించారు. వెంటనే ప్రతిపాదనలు కూడా పంపమన్నారు.ఏపీలో కేవలం ధవళేశ్వరం బ్యారేజీతో పాటు మరో ప్రాజెక్టుకు మాత్రం వరల్డ్ బ్యాంక్ నిధులివ్వడానికి అంగీకరించడం గమనార్హం. కానీ దీనికి సీఎం నుంచి ఆమోదం కావాలి. ఏడాదిన్నర దాటేసినా సీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇరిగేషన్ అధికారులు మాత్రం అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు. సీఎం నుంచి అనుమతి వస్తే బ్యారేజీ జీవితకాలం మరికొంత పెరిగినట్టే. లేకపోతే. బ్యారేజీ భవిష్యత్ అగమ్యగోచరమే.