నరకయాతన..
ABN , First Publish Date - 2022-09-09T05:23:04+05:30 IST
కలిదిండి –వెంకటాపురం ప్రధాన రహదారిలో భారీ గోతులు పడి అధ్వానంగా తయారైంది. గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో చెరువును తలపిస్తుంది.
కలిదిండి – వెంకటాపురం ప్రధాన రహదారి గోతులమయం
చెరువును తలపిస్తున్న రహదారులు
కలిదిండి, సెప్టెంబరు 8 : కలిదిండి –వెంకటాపురం ప్రధాన రహదారిలో భారీ గోతులు పడి అధ్వానంగా తయారైంది. గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో చెరువును తలపిస్తుంది. వాహనాలు గోతుల్లో దిగబడడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు. ఆర్టీసీ బస్సులను ఈ రూటుకు రద్దు చేశారు. ఆటోలు సక్రమంగా ఉండడం లేదు. కలిదిండి నుంచి పలు పనులకు కైకలూ రు వెళ్లేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. కలిదిండి నుంచి వెంకటా పురం శివారు పెదకొమ్ములేరు డ్రెయిన్పై ఉన్న వంతెన వరకు సుమారు ఆరు కిలోమీటర్లు మేర రహదారిపై భారీ గోతులు పడడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. నిత్యం విద్యార్థులు కలిదిండి నుంచి కైకలూరు లోని విద్యాలయాలకు ఆర్టీసీ బస్సులు రద్దుతో ఆటోలపై వెళ్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నూజివీడు – ఏలూరు ప్రధాన రహదారి..
ముసునూరు : నూజివీడు–ఏలూరు ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రహదారిలో సింహాద్రిపురం, గోపవరం, వేల్పుచర్ల తదితర గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పడిన భారత గుంతలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఏడాది క్రితం స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అర్భాటంగా శంకుస్థాపన చేశారు. రెండు అడుగుల వరకు కంకర వేసి రోలింగ్ చేశారు. బిల్లులు రాకపోవటంతో కాంట్రాక్టర్ పనులు నిలిపి వేశారు.