అటూ ఇటూ కుంగిన రోడ్‌ కం రైలు బ్రిడ్జి

ABN , First Publish Date - 2022-08-11T06:34:52+05:30 IST

కుంగిన రోడ్డు కం రైలు వంతెన రైలింగ్‌ వద్ద ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టినట్టు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ ఈఈ బి.బి. వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

అటూ ఇటూ కుంగిన రోడ్‌ కం రైలు బ్రిడ్జి
కుంగిన ప్రాంతాలను అధికారుల బృందం పరిశీలించారు

పరిశీలించిన అధికారులు
రూ. కోటితో ప్రతిపాదనలు

కొవ్వూరు, ఆగస్టు 10 : కుంగిన రోడ్డు కం రైలు వంతెన రైలింగ్‌ వద్ద ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టినట్టు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ ఈఈ బి.బి. వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఆసియాలోనే అతిపొడవైన వంతెనలలో ఒకటిగా పేరుగాంచిన రోడ్డు కం రైలు వంతెనపై ఫుట్‌పాత్‌ రైలింగ్‌ కొవ్వూరు వైపు 20 మీటర్లు, రాజమహేంద్రవరం వైపు 75 మీటర్లు కుంగి ప్రమాదకరంగా మారింది. రైలింగ్‌ కుంగిన ప్రాంతాలను అధికారుల బృందం బుధవారం   పరిశీలించారు. హ్యాండ్‌ రెయిల్స్‌, పుట్‌పాత్‌ స్టీల్‌బీమ్స్‌, వెర్టికల్‌ హ్యాండిల్స్‌ను చూశారు. ఈఈ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వంతెనపై రైలింగ్‌ కుంగిన ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పై ఎవరు ఎక్కకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంతెనకు ఉన్న స్టీల్‌బీమ్స్‌, కాంక్రీట్‌ బీమ్‌లు తుప్పుపట్టి మరమ్మతులకు గురైనట్టు గుర్తించామన్నారు. పాడైన బీమ్‌లను పునరుద్ధరించడంతో పాటు, రహదారి మరమ్మతులు, నిర్మాణం, ఫుట్‌పాత్‌, విద్యుత్‌ వంటి పనులు చేపట్టేందుకు రూ. కోటితో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. మొదటి విడతగా రూ.10 లక్షలు మంజూరు కాగా కుంగిన చోట రైలింగ్‌ పనులు చేపడుతున్నామన్నారు. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై పూర్తిస్తాయి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. ఆయన వెంట డీఈఈ బి.వి. మధుసూదన్‌, రైల్వేశాఖ సెక్షన్‌ ఇంజనీరు సి.హెచ్‌ శ్రీనివాసరావు ఉన్నారు. 


Updated Date - 2022-08-11T06:34:52+05:30 IST