నత్తే నయం..

ABN , First Publish Date - 2022-05-17T03:53:54+05:30 IST

ఎన్నో ఏళ్లుగా ప్రజల చిరకాల వాంఛగా నిలిచిన వరికుంటపాడు-జి.కొండారెడ్డిపల్లి రహదారి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి

నత్తే నయం..
నిర్మాణానికి నోచుకోని రహదారి

ముందుకు సాగని రహదారి పనులు

గడువు ముగిసినా పూర్తికాని వైనం

వరికుంటపాడు, మే 16: ఎన్నో ఏళ్లుగా ప్రజల చిరకాల వాంఛగా నిలిచిన వరికుంటపాడు-జి.కొండారెడ్డిపల్లి రహదారి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. మండల కేంద్రమైన వరికుంటపాడుకు చేరేందుకు శివారు గ్రామాల ప్రజలకు ఈ రహదారి ఎంతో అనుకూలంగా ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద వరికుంటపాడు నుంచి తూర్పుబోయమడుగుల మీదుగా జి.కొండారెడ్డిపల్లి వరకు 12.295 కి.మీ పొడవున రహదారి నిర్మాణానికి రూ.8.23 కోట్ల మంజూరు చేశారు. దీంతో ఇక తమ కష్టాలు తీరినట్లేనని భావించిన దూర ప్రాంతాల నుంచి చిన్నపాటి పనులకు సైతం వరికుంటపాడుకు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి పరుగులు తీసే ప్రజలకు నిరాశే మిగిలింది. తొలుత జోరుగా సాగినప్పటికీ ఆపై నెలల తరబడి నిలిచిన పనులను చూస్తుంటే నత్తే నయం అన్న ధోరణి కనిపిస్తుంది. కల్వర్టులు నిర్మించడంతో పాటు కొంత దూరం వరకు కంకర పరిచి చేతులు దులుపుకోవడంతో ప్రయాణికుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. దారి పొడవునా కంకర రాళ్ల నడుమ ప్రయాణం చేయాలంటే వాహనాలతో పాటు ఒళ్లు గుళ్ల చేసుకోవాల్సి వస్తుందని పలువురు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నపాటి వాహనాలు వెళ్లినప్పటికీ ఇక దుమ్ము, ధూళితో నిండి రోగాల పాలు కావాల్సిన దుస్థితి నెలకొంది. వీటికి తోడు అటుగా వెళ్లిన వాహనదారులు కంకర పుణ్యమాని జారి పడి గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. మరికొంత దూరం కేవలం గ్రావెల్‌ మాత్రమే వేయడంతో చినుకు పడినా, గాలి వీచిన అటుగా ప్రయాణం చేయడం సవాల్‌గా మారింది. నెలల తరబడి ఇలాంటి తంతే కొనసాగుతున్నప్పటికీ పట్టించుకొనే నాథులే కరువయ్యారు. అధికారుల అలసత్వమో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో ఏమోగాని నూతన రహదారి వెసలుబాటు సంగతి అటుంచితే ప్రజలు, వాహనదారులకు వెతలు తప్పడం లేదు. సకాలంలో ఆ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే అలివేలుమంగాపురం, తూర్పుబోయమడుగుల, గువ్వాడి, కాంచెరువు, ఇస్కపల్లి, నల్లబోతులవారిపల్లి, తోటలచెరువుపల్లి, యర్రంరెడ్డిపల్లి, గండిపాళెం, వెంగళరావునగర్‌, జి.కొత్తపల్లి, జి.కొండారెడ్డిపల్లి, నేలటూరు తదితర గ్రామాల ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు సైతం రాకపోకలు సాగించేందుకు ఎంతో అనుకూలంగా ఉండేది. 

2021లో శంకుస్థాపన

ఆ రహదారిని నిర్మించేందుకు గతేడాది జూలై 7వ తేదీన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ ఏడాది మే 28వ తేది నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంచుమించు నిర్ణీత గడువు ముగుస్తున్నప్పటికీ పనుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి మారుమూల పల్లె ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉండే ఆ నూతన రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2022-05-17T03:53:54+05:30 IST