రోడ్డు ప్రమాదంలో ట్రైనీ డాక్టర్ మృతి
ABN , First Publish Date - 2022-06-08T15:48:27+05:30 IST
కోయబత్తూర్లో కారును లారీ ఢీకొన్న ఘటనలో ట్రైనీ డాక్టర్ మృతిచెందారు. కోవై మదుకరై రాంబృందావన్నగర్కు చెందిన రామశిఖాపతి కుమార్తె రామశివాని
పెరంబూర్(చెన్నై), జూన్ 1: కోయబత్తూర్లో కారును లారీ ఢీకొన్న ఘటనలో ట్రైనీ డాక్టర్ మృతిచెందారు. కోవై మదుకరై రాంబృందావన్నగర్కు చెందిన రామశిఖాపతి కుమార్తె రామశివాని (22) కోవై ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చిన ఆమె తిరిగి కారులో ఆస్పత్రికి బయల్దేరింది. మదుకరై ఎల్ఎన్టీ రహదారి జంక్షన్లో ఓ ట్యాంకర్ లారీ కారును ఢీకొంది. ఈ ఘటనలో రామశివాని సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న మదుకరై పోలీసులు కారు శిధిలాల నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వాసుపత్రికి తరలించి, ట్యాంకర్ డ్రైవర్ తిల్లైయరసన్ను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీపెరుంబుదూర్ సమీపంలో...
కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ సమీపం ఆరణిచేరి ప్రాంతానికి చెందిన కరుణాకరన్, బాలకృష్ణన్ సోమవారం రాత్రి కాంచీపురంలో జరిగిన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని బైక్పై తిరుగుప్రయాణమయ్యారు. ఏనాత్తూర్ సమీపంలో వస్తున్న బైక్ హఠాత్తుగా అదుపుతప్పి వంతెన గోడను ఢీకొనింది. బాలకృష్ణన్ ఎగిరి వంతెన కిందున్న గుంతలోని నీళ్లలో పడి ఊపిరాడక మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని తీవ్రగాయాలైన కరుణాకరన్ను కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స ఫలించక అతను మృతిచెందాడు.