ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ABN , First Publish Date - 2020-05-10T16:02:50+05:30 IST

ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు టిప్పర్‌..

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

తిరుపతి/చెన్నై : పాకాల మండలం గుండ్లగుట్టపల్లె సమీపంలో శనివారం మధ్యాహ్నం కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు టిప్పర్‌ డ్రైవర్లు దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. చెంగల్పట్టు జిల్లా పెరియకోయిలంబాకం భజన కోవిల్‌ వీధికి చెందిన టిప్పర్‌ డ్రైవర్లు మణిబాలన్‌ వేలాయుధం(25), వేణురంగనాధన్‌(60), రామకుమార్‌ గోపాల్‌ (26), మణికందన్‌ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో జరిగే మల్లన్నసాగర్‌ రిజర్వాయరు పనులు చేయడానికి ప్రభుత్వ అనుమతులతో బయలుదేరారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గుండ్లగుట్టపల్లె వద్ద వేగంగా వెళ్తున్న వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న మామిడి తోటలోకి 30 మీటర్ల వరకు దూసుకెళ్లి బండరాళ్లను ఢీకొని బోల్తాపడింది.


ఈ ప్రమాదంలో మణిబాలన్‌ వేలాయుధం, వేణురంగనాధన్‌, రామకుమార్‌ గోపాల్‌ అలియాస్‌ వేలు దుర్మరణం చెందారు. వీరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తలకు గాయాలతో మణికందన్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో రామకుమార్‌ గోపాల్‌ కారు నడుపుతున్నారు. ప్రమాద స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ యశ్వంత్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌ పరిశీలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-10T16:02:50+05:30 IST