రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
ABN , First Publish Date - 2020-02-22T08:36:14+05:30 IST
పండుగపూట విషాదం నెలకొంది. పలు జిల్లాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద బైక్ను డీసీఎం ఢీకొని ఇద్దరు మృతి చెందారు.
పండుగ పూట విషాదం.. రక్తమోడిన రోడ్లు
ఆంధ్రజ్యోతి నెట్వర్క్: పండుగపూట విషాదం నెలకొంది. పలు జిల్లాల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ వద్ద బైక్ను డీసీఎం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. హన్వాడ మండలం పుల్కోనిపల్లికి చెందిన వెంకటయ్య(48) శంషాబాద్లో నివాసం ఉంటున్నాడు. మన్యంకొండ లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి కుటుంబంతో బయలుదేరాడు. భార్య, పెద్దకూతురును బస్సు ఎక్కించి.. తనతో పాటు ఇద్దరు కూతుళ్లు నిఖిత(8), హారికతో కలిసి బైక్పై వెళుతున్నాడు. దర్మాపూర్ దగ్గర ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొని నిఖిత, వెంకటయ్య మృతిచెందారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గోదావరి వంతెనపై డివైడర్ను ఢీ కొని ఒకరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిగ్గిరెడ్డిపల్లికి చెందిన ఇగ్గెల రాజం(48) గోదావరిఖనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జన్నారం మండలం ఇందన్పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం సాకెర-బికి చెందిన మడావి యాదవరావు (32) ఉట్నూరు వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన మెత్రి అర్జున్(35), భీమన్న(32) హైదరాబాద్లో ఉంటున్నారు. వీరిద్దరూ స్వగ్రామం నుంచి బైక్పై హైదరాబాద్కు బయల్దేరారు. సదాశివపేట మండలంలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమ వద్ద ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు.