బైక్‌ను ఢీకొన్న డీసీఎం..ఇద్దరు స్నేహితుల దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-11T17:37:16+05:30 IST

శుభకార్యానికి బైక్‌పై బయలుదేరిన మిత్రుల ప్రయాణం విషాదాంతమైంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని నసర్లపల్లి స్టేజీ సమీపంలోని మూల మలుపు వద్ద వీరి బైక్‌ను

బైక్‌ను ఢీకొన్న డీసీఎం..ఇద్దరు స్నేహితుల దుర్మరణం

శుభకార్యానికి వెళ్తుండగా ఘటన

హైదరాబాద్/చింతపల్లి: శుభకార్యానికి బైక్‌పై బయలుదేరిన మిత్రుల ప్రయాణం విషాదాంతమైంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని నసర్లపల్లి స్టేజీ సమీపంలోని మూల మలుపు వద్ద వీరి బైక్‌ను డీసీఎం ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రామంతాపూర్‌ ఇందిరానగర్‌కు చెందిన ఎస్‌కె.నాగూర్‌(18), అతని మిత్రుడు సందెపోగు రవితేజ(18) రామాంతపూర్‌లోని ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. నాగూర్‌ ఓ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్లలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో నాగూర్‌ తన మిత్రుడు రవితేజతో కలిసి పల్సర్‌  బైక్‌పై బయలుదేరారు. చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి స్టేజీ సమీపంలో మూలమలుపు వద్ద కొండమల్లేపల్లి నుంచి వీటీనగర్‌వైపు కోళ్లలోడ్‌తో వెళ్తున్న డీసీఎం వీరి బైక్‌ను ఢీకొట్టింది.


దీంతో బైక్‌పై ఉన్న రవితేజ(18) అక్కడికక్కడే మృతిచెందాడు. నాగూర్‌కు కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్తున్న దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు ప్రమాద ఘటన చూసి ఓ వాహనంలో నాగూర్‌ను దేవరకొండ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. డీసీఎం డ్రైవర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి బైక్‌ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్‌ పరారయ్యాడు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి పోలీసులు తెలిపారు. 

Read more