దంపతులను ఢీకొట్టిన లారీ భార్య మృతి, భర్తకు గాయాలు
ABN , First Publish Date - 2022-04-09T16:51:57+05:30 IST
కొత్తగా నిర్మించుకున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను అతివేగంగా దూసుకువచ్చిన
హైదరాబాద్/రామంతాపూర్: కొత్తగా నిర్మించుకున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను అతివేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య కమల అక్కడికక్కడే మృతి చెందగా, భర్త గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదం రామంతాపూర్లో శుక్రవారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము గ్రామానికి చెందిన బొరడ పున్నగిరి రామంతాపూర్ ఇందిరానగర్లో భార్యా పిల్లలతో నివసిస్తూ పెయింటర్ వృత్తి చేస్తున్నాడు. ఇటీవల కొత్తగా నిర్మించుకున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేసేందుకని శుక్రవారం ఉదయం యాక్సిస్ బైక్(టీఎ్స08హెచ్హెచ్ 380)పై అతని భార్య బొరడ కమల (42)తో కలిసి రామంతాపూర్ నుంచి చర్లపల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో రామంతాపూర్ బద్రాస్ హోటల్ వద్దకు రాగానే వెనకనుంచి అతి వేగంగా దూసుకు వచ్చిన లారీ (ఏపీ20టీఏ9378) బైక్ను ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ కిందపడ్డారు. కమల తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, భర్త పున్నగిరికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉప్పల్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.